Pak Fake Judge: పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ హైకోర్టు విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నకిలీ లా పట్టాతో ఓ వ్యక్తి.. ఏకంగా ఐదేళ్లు న్యాయమూర్తిగా వ్యవహరించడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. దీనిపై విచారణ జరిపిన.. హైకోర్టు బెంచ్ చివరికీ నకిలీ న్యాయమూర్తిపై వేటు వేసింది. అతడి లా డిగ్రీని రద్దు చేయడంతో పాటు.. న్యాయమూర్తిగా అతడి నియామకం చెల్లదని తీర్పు వెలువరించింది.
పాక్ కు చెందిన డాన్ పత్రిక కథనం ప్రకారం.. నకిలీ న్యాయమూర్తికి సంబంధించి ఇస్లామాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 23న 116 పేజీల వివరణాత్మక తీర్పును వెలువరించింది. నకిలీ లా పట్టాతో జడ్జి పదవి పొందిన తారిక్ మహమ్మద్ జహంగీర్ ను ఆ హోదా నుంచి తొలగించింది. జహంగీర్.. 2020 డిసెంబర్ లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకున్న అర్హతలపై అనుమానాలు చెలరేగడంతో గతేడాది సెప్టెంబర్ లో జహంగీర్ ను జడ్జి విధుల నుంచి సస్పెండ్ చేశారు.
కరాచీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఇచ్చిన అసలు రికార్డుల ఆధారంగా జహంగీర్ సమర్పించిన లా పట్టా నకిలీదని హైకోర్టు బెంచ్ తేల్చింది. 1988లో జహంగీర్ న్యాయమూర్తి పరీక్షకు తొలిసారి హాజరైనట్లు కోర్టు గుర్తించింది. అయితే పరీక్షలో కాపీ కొట్టినట్లు తేలడంతో 1989లో కరాచీ విశ్వవిద్యాలయం అతడిపై మూడేళ్ల పాటు నిషేధం సైతం విధించినట్లు తేలింది. కాగా, మరుసటి ఏడాది ఇంతియాజ్ అహ్మద్ అనే పేరు గల విద్యార్థికి కేటాయించిన నమోదు సంఖ్యను ఉపయోగించి తారిక్ జహంగీర్ పరీక్షలకు హాజరైనట్లు వెల్లడైంది.
Also Read: Maoist Leader Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి మిస్సింగ్.. భారత్లో ఉన్నారా? నేపాల్ పారిపోయారా?
అయితే అసలు పత్రాలు సమర్పించేందుకు, రాతపూర్వక వివరణ ఇచ్చేందుకు జహంగీర్ కు ఇస్లామాబాద్ హైకోర్టు అవకాశం కల్పించింది. కానీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమైనట్లు హైకోర్టు బెంచ్ తెలిపింది. అందుకు బదులుగా.. తనపై జరుగుతున్న విచారణను అడ్డుకునేందుకు పైకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశాడని పేర్కొంది. మెుత్తంగా అతడు అనధికారికంగా లా పట్టా పొందాడన్న ఆరోపణలు నిజమని తేలడంతో జడ్జి పదవి నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ తీర్పు వెలువరించింది.
Also Read: Donald Trump: భారత్ను ఆపకపోయుంటే.. పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్