Donald Trump: భారత్ – పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ప్రగల్భాలు పలికారు. మెుత్తంగా 8 యుద్ధాలను ఆపడంలో కీలక భూమిక పోషించినట్లు చెప్పుకున్నారు. అమెరికా జోక్యం చేసుకోకపోయుంటే ఆపరేషన్ సిందూర్ కారణంగా 35 మిలియన్ల మంది ప్రజలు చనిపోయేవారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఓ దశలో పాక్ ప్రధాని సైతం చనిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు.
యూఎస్ కాంగ్రెస్ లో స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమెరికన్లు స్వదేశంతో పాటు విదేశాల్లోనూ సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తన మెుదటి 10 నెలల్లోనే 8 యుద్ధాలను ముగించానని.. తాను జోక్యం చేసుకోకుండా ఉండుంటే భారత్ – పాక్ అణుయుద్ధానికి దిగేవని ఆరోపించారు. తన ప్రమేయం లేకుంటే 35 మిలియన్ల మంది ప్రజలు చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని స్వయంగా చెప్పినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం 9వ యుద్ధాన్ని సైతం ముగించడానికి తాను చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ చెప్పుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. జో బైడన్ కి బదులు గత పర్యాయం తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. అసలు రష్యా-ఉక్రెయిన్ ల హత్యాకాండ, మారణహోమం జరిగి ఉండేదని కాదని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్ – పాక్ యుద్ధాన్ని తన మధ్యవర్తిత్వం ద్వారా ముగించానని గతేడాది మే 10న డొనాల్డ్ ట్రంప్ తొలిసారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ పలు వేదికలపై 80 సార్లకు పైగా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ కు బ్రేక్ ఇవ్వడం వెనుక ఎవరి మధ్యవర్తిత్వం లేదని కేంద్రం.. ఇదివరకే స్పష్టంగా చెప్పినప్పటికి ట్రంప్ మాత్రం దీనిని తన ఖాతాలో వేసుకోవడం మానడం లేదు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే 200 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించానని.. దెబ్బకి భారత్ – పాక్ దిగివచ్చాయని ట్రంప్ పేర్కొంటున్నారు.
Also Read: Chicken Curry: గోవాలో చికెన్ కర్రీ ఇలాగే వండుతారు, ఒక్కసారి తింటే మర్చిపోలేరు
కాగా, గతేడాది ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ముష్కరులు మతాన్ని అడిగి మరి.. వారిని పొట్టనబెట్టుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రస్థావరాను మే 7న వైమానిక దాడులు జరిపి ధ్వంసం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైనా యుద్ధం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరికి రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) చర్చల అనంతరం ఉద్రిక్తలు చల్లారాయి.
Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు టాలీవుడ్ హీరోలతో విభేదాలా? ఇదెక్కడి విడ్డూరం!