MV Hondius hantavirus outbreak: అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్లో ప్రాణాంతకమైన హంటావైరస్ కలకలం రేపింది. డచ్ జెండా కలిగిన ఎంవీ హాండియస్ అనే నౌకలో 23 దేశాలకు చెందిన ప్రయాణికులు.. సిబ్బంది కలిపి మొత్తం 149 మంది చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఈ నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వెర్డే దీవుల వద్ద నిలిచిపోయింది. నౌకలో అనుమానాస్పద వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. స్థానిక ఆరోగ్య అధికారులు నౌకను రేవుకు చేరడానికి లేదా అనారోగ్యంతో ఉన్న సిబ్బందిని తరలించడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు.
మొదటి మరణం ఏప్రిల్ 11న సంభవించగా. మృతుల్లో 70 ఏళ్ల డచ్ వ్యక్తి.. అతని 69 ఏళ్ల భార్య ఉన్నారు. సదరు మహిళ మరణం తర్వాత జరిపిన పరీక్షల్లో ఆమెకు హంటావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మే 2వ తేదీన జర్మనీకి చెందిన మరో ప్రయాణికుడు నౌకలోనే కన్నుమూశారు. ప్రస్తుతం ఒక బ్రిటిష్ పౌరుడు తీవ్రమైన లక్షణాలతో జోహన్నెస్బర్గ్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నౌకలో ఉన్న మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయని.. వారికి తక్షణ వైద్య సహాయం అవసరమని క్రూయిజ్ సిబ్బంది వెల్లడించారు.
ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. సాధారణంగా ఈ వైరస్ పర్యావరణ ప్రభావం వల్ల వస్తుందని.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుందని WHO పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులను ఖాళీ చేయించడానికి.. పూర్తి స్థాయి రిస్క్ అసెస్మెంట్ చేయడానికి తాము మద్దతు ఇస్తున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ వెల్లడించారు. అత్యవసర చికిత్స కోసం నౌకను స్పెయిన్లోని కానరీ ఐలాండ్స్కు తరలించే దిశగా ఆపరేటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
హంటావైరస్ అనేది ఎలుకలు.. ఎలుకల వంటి జంతువుల ద్వారా వ్యాపించే జూనోటిక్ వైరస్ కుటుంబానికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు సుమారు 38% వరకు ఉంటుంది. నౌకలో ఉన్నవారికి ఈ వైరస్ ఎలా సోకిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Read Also: జర్నలిజం నోబెల్ పులిట్జర్.. భారతీయులను వరించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం