Petrol and Diesel Rates Across India: ఇరాన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదేశం గల్ఫ్ కంట్రీస్ లోని ఆయిల్ కంపెనీల మీద దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో మళ్లీ పెట్రో ధరల పెంపుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవాళ (మే 5, 2026) దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా మార్పులేకుండా యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నప్పటికీ, దేశీయంగా మాత్రం వినియోగదారులపై కేంద్రం ఎలాంటి భారం పడకుండా చూసుకుంటుంది. భారతీయ ఆయిల్ కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి.
దేశంలో ఇంధన ధరలను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డాలర్-రూపాయి మారకపు విలువ లాంటి అంశాలను ఆధారంగా తీసుకుని మార్పులు చేస్తారు. అయితే, వినియోగదారులకు ఒక్కసారిగా ధరల భారం పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇవాళ ప్రధాన నగరాల్లో ధరలు పెద్దగా మారలేదు. ఢిల్లీలో పెట్రోల్ ధర సుమారు రూ. 94.72 కాగా, డీజిల్ రూ. 87.62 దగ్గర కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ. 104 దాటగా, డీజిల్ రూ. 92గా ఉంది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 107.46, డీజిల్ రూ. 95.70గా కొనసాగుతోంది. చెన్నై, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
ఇక కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధర మే 1 నుంచి భారీగా పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతోంది. అయితే, డొమెస్టిక్ సిలిండర్లపై మాత్రం ఇప్పటి వరకు పెద్దగా మార్పులు లేవు.
ఇంధన ధరలు నగరాల వారీగా మారడానికి ప్రధాన కారణం పన్నులు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం విధిస్తే, రాష్ట్రాలు తమ వాటా వ్యాట్ వసూలు చేస్తాయి. ఈ రేట్లు ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఉండటం వల్ల ధరల్లో తేడా వస్తుంది. అదనంగా, రవాణా ఖర్చులు, స్థానిక సుంకాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇటీవల ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతూనే ఉంటే, భవిష్యత్తులో మార్పులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: మరింత స్టైలిష్గా కర్వ్ EV.. కొత్త రంగులో ఏముంది భయ్యా!