Big tv reporter charmi: హైదరాబాద్లోని దుర్గం చెరువులో కాలుష్యం పెరిగిందంటూ వీడియో చేసిన జర్నలిస్టుపై ఫేక్ ప్రచారం మొదలైంది. తాజాగా దుర్గం చెరువు కాలుష్యంపై బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఆ వీడియో చేసినందుకే ఛార్మిని బిగ్ టీవీ నుంచి తొలగించారంటూ కొందరు ఫేక్ ప్రచారం ప్రారంభించారు. కానీ అదంతా అబద్ధం.. రిపోర్టర్ ఛార్మి బిగ్ టీవీలోనే పనిచేస్తున్నారు. నికార్సైన జర్నలిజానికి బిగ్ టీవీ ఎప్పుడూ అండగానే ఉంటుంది. నిజమైన జర్నలిజానికి నిదర్శనం బిగ్ టీవీ.. ఛార్మిపై వస్తున్న రూమర్స్ అన్నీ ఫేక్.
దుర్గం చెరువులో చేపలు చనిపోతున్నాయి.. చుట్టూ కాలుష్యం పేరుకుపోయింది. దానికి గల కారణాలు ఇంకా తెలియవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాంపిల్స్ సేకరించి అసలు కారణాలు తెలుసుకోవాలని ఛార్మి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, దీనిపై ఇప్పుడు తప్పుడు ప్రచారం నడుస్తోంది.
ఇదే అంశంపై ఛార్మి స్పందించారు. తాను పోస్ట్ చేసిన వీడియో టెక్నికల్ ఇష్యూ వల్ల డిలీట్ అయిందని ఆమె తెలిపారు. అయితే ఆ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసి, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండకు చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేశారని తెలిపారు. ఒక ప్రజా సమస్య గురించి వీడియో చేసినందుకు తనపై బెదిరింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. తాను చేసిన వీడియోను వక్రీకరించడంతో పాటు, తనను యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. తాము దేనికి భయపడమని, ఎవరికీ తలవంచమని ఆమె తేల్చిచెప్పారు.
కొందరు నిలదీసే గొంతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వ్యూహాత్మకంగా మీడియా సంస్థలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ధోరణిని మార్చుకోవాలి.