Pak Bomb Blast: పాకిస్థాన్ దేశంలో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ లోకల్ కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కారులో బ్లాస్టింగ్ జరగడంతో.. స్పాట్ లోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఇది ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్ సరిహద్దులోని ఆర్మీ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవాలన్న మిలిటెంట్స్ ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ భగ్నం చేసిన తర్వాత రోజే ఈ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ బాంబ్ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ప్రాంతం సాధారణంగా కోర్టు విచారణల కారణంగా నిత్యం వందలాది మందితో రద్దీగా ఉంటుంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ భారీ పేలుడు ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలంలో విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది.
ఢిల్లీలో కారు పేలుడు ఘటన జరిగి 24 గంటలు కాకముందే ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు, అఫ్గాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని ఒక ఆర్మీ కేడెట్ కళాశాల విద్యార్థులను బందీలుగా తీసుకోవడానికి మిలిటెంట్లు చేసిన ప్రయత్నాన్ని పాక్ ఆర్మీ అంతకుముందు రోజు భగ్నం చేసింది. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు ఆత్మాహుతి కారు బాంబర్తో సహా ఆరుగురు ఉగ్రవాదులను అడ్డుకున్నాయి. ఆర్మీ ప్రయత్నాన్ని భగ్నం చేసిన మరుసటి రోజే రాజధాని నగరంలో బాంబ్ బ్లాస్ట్ జరగడంతో.. దీని వెనుక ఉగ్రవాద కోణం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రస్తుతానికి.. ఈ పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా..? పోలీసులు విచారిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల బెడద నేపథ్యంలో.. ఇస్లామాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన దేశ భద్రతా పరిస్థితులపై మరోసారి తీవ్ర ఆందోళనను పెంచింది. కోర్టు ఆవరణలో భద్రతా లోపాలు ఉన్నాయా అనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు
ALSO READ: Delhi Car Blast: ఒక్కరిని కూడా వదిలిపెట్టం.. ఢిల్లీలో పేలుడు ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్