Brazil Supreme Court Blast| బ్రెజిల్ దేశ రాజధాని బ్రెసిలియాలో ఫెడరల్ సుప్రీ కోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం కోర్టు కార్యకలాపాలు ముగిసిన కాసేపటికే రెండు భారీ పేలుళ్లు జరిగాయని, ఈ పేలుళ్లలో ఒకరు మరణించారని స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా రీత్యా రక్షణ బలగాలు, ఫెడరల్ పోలీసులు వెంటనే సుప్రీం కోర్టులో ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. పేలుళ్ల ధాటికి కోర్టు చుట్టుపక్కల వాతావరణమంతా దట్టమైన నల్లని పొగలు కమ్మేశాయి.
పేలుళ్లు జరిగిన సమయంలో సుప్రీం కోర్టు లోపల కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. కోర్టులో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. “కోర్టులో విచారణ చివరి సెషన్ ముగిసిన కొన్ని క్షణాల్లోనే రెండు భారీ పేలుళ్లు వినిపించాయి. పేలుళ్ల ధాటికి కోర్టు ఆవరణ కూడా కంపించింది. ఆ సమయంలో కోర్టులోపల మంత్రులు కూడా ఉన్నారు. వారిని సురక్షితంగా కోర్టు భవనం నుంచి భద్రతా బలగాలు తీసుకెళ్లాయి. ఫెడరల్ పోలీసులు వెంటనే చేరుకొని.. ఒక బాంబ్ కంట్రోల్ స్క్వాడ్తో కోర్టు పరిసరాల్లో తనిఖీ చేయించారు. ఈ ప్రదేశంలో ఉన్న త్రీ టవర్స్ ప్లాజాలో మొత్తం తనిఖీలు చేయించారు. త్రీ టవర్స్ ప్లాజాలో కీలక ప్రభుత్వ భవనాలైన సుప్రీం కోర్టు, ది ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, కాంగ్రెస్ బిల్డింగ్ ఉన్నాయి. పేలుళ్లు సుప్రీం కోర్టు బయట ఉన్న కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగాయి. జరిగిన రెండు పేలుళ్లలో ఒకటి కారులో జరిగింది.” అని తెలిపారు.
Also Read: మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావొచ్చేమో?.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
అయితే ఈ పేలుళ్ల వెనుక ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ముందుగా కారులో బాంబు పెట్టుకొని సుప్రీం కోర్టులో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయట పార్కింగ్ లోనే కారు పెట్టాలని లోపలికి అనుమతించలేదు. పేలుళ్లలో చనిపోయిన వ్యక్తి అతడేనని పోలీసులు అనుమాన్యం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ధాటి అతిన శవం ముక్కలై పోవడంతో గుర్తించడానికి కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు.
సుప్రీం కోర్టు వద్ద జరిగిన భారీ పేలుళ్లపై బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆందోళన వ్యక్తం చేశారు. సెనేట్ ప్రెసిడెంట్ రోడ్రిగో పచికో, సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లూయిస్ రాబర్టో బార్రోసో ఘటనపై అధ్యక్షుడితో ఫోన్ లో చర్చించారు.
అయితే మరికొన్ని రోజుల్లో బ్రెజిల్ లోని రియో డి జానిరియో నగరంలో జి20 సమావేశాలు ఉండగా రెండు భారీ పేలుళ్లు జరగడంతో సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు పడ్డారు. ఇలాంటి పేలుళ్లు జనవరి 2023లో కూడా బ్రెజిల్ లో జరిగాయి. అప్పుడు ఎన్నికలు నిజాయితీ జరగలేదని మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఆరోపణలు చేసిన తరువాత ఆయన మద్దతుదారులు ప్రభుత్వ భవనాల్లో చొరబడి కొత్త ప్రభుత్వాన్ని కూలదీయాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రభుత్వ భవనాల బయట పేలుళ్లు కూడా జరిగాయి.
ఆ హింసాత్మక ఘటనల వెనుక మాజీ అధ్యక్షుడు బోల్సనారో, ఆయన మద్దతుదారులు ఉన్నారనే ఆరోపణల రావడంతో వారిపై సుప్రీం కోర్టులో విచారణ కూడా జరుగుతోంది.