భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనంటూ ఇప్పటికే పలుమార్లు బహిరంగ వేదికలపై ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆమాటల్ని ఎవరూ నమ్మట్లేదని అనుకున్నారో ఏమో మరోసారి మరింత గట్టిగా సెల్ఫ్ డబ్బా మొదలు పెట్టారు. అయితే ఇన్నాళ్లూ తాను చర్చలతో సమస్యను పరిష్కరించానని అన్న ట్రంప్, ఈసారి మాత్రం తన వార్నింగ్ బాగా పనిచేసిందని చెప్పుకోవడం విశేషం. టారిఫ్ లు పెంచేస్తానంటూ ఇరు దేశాలకు వార్నింగ్ ఇచ్చి మరీ యుద్ధాన్ని ఆపేశానన్నారు ట్రంప్.
అలా భయపెట్టా..!
భారత్, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆ రెండు దేశాల అధినేతలకు తాను ఫోన్ చేసి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు ట్రంప్. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని మోదీని చాలా గట్టి వ్యక్తి అని సంబోధించడం విశేషం. అయితే తాను ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఇరు దేశాలు నష్టపోతాయని నచ్చజెప్పానని, అప్పటికీ వినకపోయే సరికి సుంకాల మోత మోగిస్తానంటూ హెచ్చరించానని అన్నారు. ఆ దెబ్బకి రెండు దేశాలు దిగొచ్చాయని, యుద్ధాన్ని విరమించాయని గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్. ఇన్నాళ్లూ సుంకాల గురించి ఎక్కడా ప్రస్తావించని ఆయన, తొలిసారిగా బెదిరించి మరీ యుద్ధాన్ని ఆపేశాననడం విశేషం. తాను బెదిరించిన ఐదు గంటల్లోనే రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయన్నారు ట్రంప్.
భారత్ పైనే ప్రతీకారం..
పోనీ ట్రంప్ మాటలు నిజమే అనుకున్నా.. యుద్ధం ఆపేశాక భారత్ పై ఆయన సుంకాలను భారీగా వడ్డించడాన్ని ఎలా చూడాలి. అదే సమయంలో పాకిస్తాన్ పై సుంకాల పెంపు లేకపోవడాన్ని ఏమనాలి? ట్రంప్ తన అసత్య వాదనలతో కాలం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. సుంకాల పేరు చెప్పి భారత్, పాక్ ని బెదిరించి ఉంటే.. యుద్ధం ఆపేశారు కాబట్టి ఇరు దేశాలపై సుంకాల పెంపు ఉండకూడదు. కానీ భారత్ పై ఎక్కడా లేనట్టుగా 50శాతం సుంకాలు విధించారు ట్రంప్. దానికి రష్యా-భారత్ మధ్య ఉన్న చమురు ఒప్పందాన్ని బూచిగా చూపిస్తున్నారు. పోనీ ఇక్కడైనా ఆయనకు చిత్తశుద్ధి ఉందా అంటే అదీ లేదు. రష్యాతో చమురు ఒప్పందాలను చేసుకున్న చాలా దేశాలను వదిలిపెట్టి కేవలం భారత్ పైనా ఆయన ప్రతీకారం తీర్చుకున్నారు.
భారత్ స్పందన ఏంటి..?
ట్రంప్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇదే మొదటి సారి కాదు. యుద్ధ విరమణ అనంతరం ట్రంప్ తన సొంత సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది తానేనన్నారు. ఆ తర్వాత మరో 40 సార్లు తన వాదనను ఆయన రిపీట్ చేశారు. భారత్ ఇప్పటికే ఈ విషయంలో పలుమార్లు తన స్పందన తెలియజేసింది. ఆపరేషన్ సిందూర్ విరామంలో ఏ ఇతర దేశ జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది. పార్లమెంట్ లో కూడా ప్రధాని మోదీ ఇదే విషయాన్ని చెప్పారు. పాకిస్తాన్ తో యుద్ధం ఆపేయాలంటూ ఏ దేశం కూడా తమకు చెప్పలేదని, ఒత్తిడి చేయలేదని అన్నారు. అయితే ట్రంప్ తాజా వ్యాఖ్యలపై మరోసారి భారత్ స్పందిస్తుందేమో వేచి చూడాలి.