“ఇక్కడెవరో నన్ను పూలచొక్కా అన్నారు, అర్జంట్ గా లెక్చరర్ నాకు సారీ చెప్పాలి.” నువ్వు-నేను సినిమాలో కమెడియన్ సునీల్ ఫేమస్ డైలాగ్ ఇది. సంబంధం లేని విషయంలో లెక్చరర్ ని సారీ చెప్పాలని అడగడం కామెడీగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి కామెడీయే చేస్తోంది అమెరికా. సంబంధం లేని విషయంలో ఇండియాకు షాకులిస్తానంటోంది. అమెరికా-రష్యా మధ్య చర్చలకు రంగం సిద్ధమైన వేళ, ఆ చర్చలు విఫలమైతే ఇండియాపై టారిఫ్ ల మోత మోగుతుందనే హెచ్చరిక ఎంతటి అసంబద్ధమో ఆలోచించండి.
అమెరికా-రష్యా.. మధ్యలో చైనా
ఆగస్ట్ 15న అలాస్కాలో ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధాన్ని ఆపేయడమే ఈచర్చల ప్రధాన అజెండా. చర్చలు సఫలమైతే యుద్ధం ఆగుతుంది, విఫలమైతే యుద్ధం కంటిన్యూ అవుతుంది. అంతే కాదు, మధ్యలో భారత్ పై టారిఫ్ బండ పడుతుంది. ఈ చర్చలు విఫలమైతే భారతదేశంపై మరిన్ని సుంకాలు విధిస్తామని అమెరికా హెచ్చరించడం గమనార్హం. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
నిండా మునిగాక..
ప్రతీకార సుంకాలతో ఇప్పటికే భారత్ ని టార్గెట్ చేసింది అమెరికా. మొదట్లో 25 శాతం సుంకాలు విధించారు. ఇటీవల దాన్ని 50శాతానికి పెంచారు. ఇక పెంచడానికి ఏం మిగిలుంది అనుకుంటున్న తరుణంలో మరో పిడుగులాంటి వార్త. రష్యా-అమెరికా చర్చలు విఫలమైతే ఈ పెంపు మరింత దారుణంగా ఉంటుందనే హెచ్చరిక మన వ్యాపారవేత్తలను కలవరపెడుతోంది.
ఎందుకిదంతా?
ఇండియా చమురు కొనుగోలు చేయడం ద్వారా వస్తున్న ఆదాయంతో రష్యా, ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోందనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. రష్యానుంచి ఇతర దేశాలు కూడా చమురు దిగుమతి చేసుకుంటున్నాయి కదా, వాటి సంగతేంటి అని ప్రశ్నిస్తే మాత్రం ఆయన నుంచి సమాధానం ఉండదు. ఉద్దేశపూర్వకంగానే ఇండియాని టార్గెట్ చేసి మరీ సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. రష్యాను బూచిగా చూపించి సుంకాలను గరిష్టంగా 50శాతానికి పెంచారు.
భారత్ వ్యూహం ఏంటి?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే భారత్ కి కాస్త ఉపశమనం దొరికే అవకాశముంది. దీనికోసం భారత్ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల భారత ప్రధాని మోదీతో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడారు. యుద్ధానికి చరమగీతం పాడటంలో భారత సాయాన్ని ఆయన కోరారు. ఈ యుద్ధంపై భారత్ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. వివాదాన్ని త్వరగా, శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని భారత్ తెలిపింది. అవకాశం ఉన్న ప్రతి సహకారాన్ని అందించడానికి, ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని ప్రకటించారు. అయితే ట్రంప్ సుంకాలకు భయపడి తాము రష్యాతో చమురు డీల్ క్యాన్సిల్ చేసుకోలేమని, తమదేశ ప్రజలపై భారం మోపలేమని భారత ప్రభుత్వం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. 50శాతం సుంకాలే భారం అనుకుంటున్న వేళ, వాటిని మరింత పెంచుతామంటూ అమెరికా హెచ్చరించడం, దానికి వింతైన కారణం చెప్పడం మరీ విచిత్రంగా తోస్తోంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయాలపై ఎంత త్వరగా దృష్టిపెడితే అంత మంచిది అంటున్నారు ఆర్థికరంగ నిపుణులు.