అప్పులకోసం అర్రులు చాస్తున్న పాకిస్తాన్ కు మరో భంగపాటు ఎదురైంది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ (IMF) నుంచి రూ.8,540 కోట్లు మంజూరు చేసినట్టే చేసి, చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు IMF ప్రతినిధులు. దీంతో పాక్ కి షాక్ తగిలినట్టయింది. నిధులు విడుదల చేయాలంటే కొత్తగా 11 నిబంధనలు పాటించాల్సిందేనని IMF ప్రతినిధులు పాక్ కి తేల్చి చెప్పారు. దీంతో నిధుల విడుదల డైలమాలో పడింది.
ఎందుకీ షరతులు..?
IMF నుంచి నిధులకోసం పాకిస్తాన్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అయితే పహల్గాం దాడుల అనంతరం కొన్నిరోజులకే నిధుల విడుదలకు IMF అనుమతులివ్వడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాద దేశంగా పేరుబడి, ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న పాకిస్తాన్ కు IMF నిధులిచ్చి సాయం చేయడం సరికాదని భారత్ తెలిపింది. ఆ సంస్థ ఇచ్చే నిధుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదం కోసం ఉపయోగిస్తుందని స్పష్టం చేసింది. IMF నిధుల విడుదల విషయంలో అమెరికా నిర్ణయం కీలకం. అమెరికాకు వీటో అధికారం కూడా ఉంది. కానీ ఆ దేశం నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకం చెప్పలేదు. అంటే.. అమెరికా కూడా పరోక్షంగా పాకిస్తాన్ కు, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్టే చెప్పుకోవాలి. అందుకే అమెరికా సహా, IMF దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. కొత్తగా పాకిస్తాన్ కు 11 షరతులు పెట్టాయి. ఇందులో వివిధ రంగాల్లో సంస్కరణలు కీలకంగా ఉన్నాయి. అంతే కాదు, భారత్తో ఉద్రిక్తతలు పెంచుకోవడం వల్ల పాకిస్తాన్ కే ఎక్కువ నష్టం అని స్పష్టం చేసింది IMF. భారత్ తో ఘర్షణలు పెట్టుకుంటే సంస్కరణలు తీసుకు రావడం కష్టం అని, 11 కొత్త నిబంధనల్లో సంస్కరణలు కూడా ఉన్నాయని IMF తెలపడం విశేషం.
పాకిస్తాన్ కు గతంలో కూడా నిధుల విడుదల విషయంలో IMF 39 షరతులు విధించింది. కొత్తగా విధించిన 11 షరతులతో కలిపి అవి మొత్తం 50కి చేరాయి. IMF తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ వచ్చే బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయింపుల్ని భారీగా పెంచబోతోంది. గతంతో పోలిస్తే 12 శాతం ఆ పెంపు ఉంటుందని తెలుస్తోంది. అంటే పాకిస్తాన్ రక్షణ రంగ బడ్జెట్ 2.414 ట్రిలియన్లకు చేరుకుంటుంది.
ఐటీ చట్టాల్లో మార్పులు, పన్ను చెల్లింపుదారుల గుర్తింపు నమోదు విషయాల్లో సంస్కరణలు తేవడం ఈ షరతుల్లో కీలకమైనవి. ప్రావిన్స్ లలో గవర్నెన్స్ యాక్షన్ ప్లాన్ ని రూపొందించడానికి IMF సూచించే గవర్నెన్స్ డయాగ్నస్టిక్ అసెస్మెంట్ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలి. 2028 నుండి సంస్థాగత ఆర్థిక కేటాయింపుల్లో నియంత్రణ కోసం ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక ఇంధన రంగంలో నాలుగు కొత్త షరతులు ప్రవేశపెట్టాల్సి ఉంది. విద్యుత్ చార్జీలను పునర్ వ్యవస్థీకరించాలి. పరిశ్రమలను జాతీయ విద్యుత్ గ్రిడ్ కి మార్చుకోవాలి. 2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్లు, పారిశ్రామిక పార్కులు, జోన్లకు సంబంధించి అన్ని ప్రోత్సాహకాలను పూర్తిగా నిలిపివేయాలి. 5 ఏళ్లలోపు సెకండ్ హ్యాండ్ కార్ల దిగుమతిపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలి.
ఈ నిబంధనలన్నిటితో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కానీ ఆ దేశానికి ముందు వేరే ప్రత్యామ్నాయం లేదు. అయితే భారత్ తో గొడవలు పడొద్దని, దానివల్ల సంస్కరణలు అమలు చేయడం వీలు కాదని పాక్ ని IMF హెచ్చరించడం విశేషం. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం కూడా ఇకపై పాక్ కి సాధ్యం కాకపోవచ్చు.