India-US Trade Deal: భారత్ మరియు అమెరికా మధ్య జరగాల్సిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (Trade Deal) కార్యరూపం దాల్చకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ సంచలన ఆరోపణలు చేశారు. జనవరి 9, 2026న ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య ఒప్పందం ఆలస్యం కావడానికి విధానపరమైన అడ్డంకులు లేదా టారిఫ్ వివాదాలు కారణం కాదని, కేవలం ఒక ఫోన్ కాల్ చేయకపోవడమే ఈ డీల్ను నిలిపివేసిందని స్పష్టం చేశారు.
వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అన్ని చర్చలు పూర్తయ్యాయని, కేవలం ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు (Closer) డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ నేరుగా ఫోన్లో మాట్లాడాలని తాను సూచించినట్లు లుట్నిక్ తెలిపారు. అయితే, భారత ప్రభుత్వం ఈ విషయంలో అసౌకర్యంగా భావించిందని, అందుకే మోదీ ఫోన్ చేయలేదని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందం కోసం భారత్కు మూడు వారాల సమయం ఇచ్చామని, కానీ ఆ గడువులోగా నిర్ణయం తీసుకోకపోవడంతో భారత్ ఆ అవకాశాన్ని కోల్పోయిందని లుట్నిక్ పేర్కొన్నారు. అప్పటికే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలతో ఒప్పందాలు పూర్తయ్యాయని, భారత్ ఆలస్యంగా స్పందించేసరికి పరిస్థితి మారిపోయిందని ఆయన వివరించారు.
భారత్ తీరును బ్రిటన్తో పోలుస్తూ లుట్నిక్ కీలక ఉదాహరణ ఇచ్చారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్నకు ఫోన్ చేసిన రోజే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం ముగింపునకు వచ్చిందని, మరుసటి రోజే మీడియా సమావేశంలో ఇరువురు నేతలు దాని గురించి ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఫోన్ చేయడానికి మోదీ నిరాకరించినప్పటికీ, ఈ ఒప్పందంపై ట్రంప్నకు కాల్ చేయడానికి మోదీకి ఇంకా అవకాశం మిగిలే ఉందని లుట్నిక్ వ్యాఖ్యానించారు. రాబోయే నెల రోజుల్లో భారత్ మళ్లీ చర్చలకు వచ్చి ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటుందని తాను భావిస్తున్నట్లు ఆయన జోస్యం చెప్పారు.
ఒకవైపు వాణిజ్య చర్చలు జరుగుతున్న తరుణంలోనే, రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న దేశాలపై (భారత్తో సహా) అమెరికా 50 శాతం నుండి 500 శాతం వరకు అదనపు సుంకాలను విధించేలా కొత్త బిల్లును ప్రతిపాదించడం గమనార్హం. దీనివల్ల భారత్ నుండి అమెరికాకు జరిగే సుమారు 120 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, లుట్నిక్ చేసిన ఈ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు, అవి ఖచ్చితమైనవి కావని పేర్కొన్నారు.
Read Also: సైబర్ బాధితుల కోసం ‘సైబర్ మిత్ర’.. ఇక ఇంటి నుంచే ఫిర్యాదు చేసుకోవచ్చు..