Iran Human Chain Strategy: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఈ రాత్రికి ఇరాన్ పై విరుచుకు పడతామని, ఆ దేశ నాగరికత ముగుస్తుందని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ ను ఎదుర్కొనేందుకు ఇరాన్ సరికొత్త స్ట్రాటజీని వాడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్పడాలని ఇరాన్ ప్రభుత్వం యువతకు పిలుపునిచ్చింది. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. దీంతో దాడులు జరగబోయే కొద్ది గంటల ముందు.. పవర్ ప్లాంట్ల వద్ద పౌరులతో మానవహారాలు నిర్మించాలని ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆ దృశ్యాలను ప్రపంచమంతా లైవ్ చూసేలా ఏర్పాట్లు చేసింది. యుద్ధం వేళ ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని రచించిందని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు.
అమెరికా ఇరాన్ పవర్ ప్లాంట్లను టార్గెట్ చేస్తే.. అరేబియా గల్ఫ్లో అమెరికా, దాని మిత్ర దేశాల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. రాబోయే ఏళ్ల పాటు గల్ఫ్ దేశాల్లో చమురు, గ్యాస్ను వారికి దక్కకుండా చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది. ఇరాన్ సైన్యం పిలుపుతో వంతెనలు, విద్యుత్ కేంద్రాల చుట్టూ పౌరులు మానవహారాలుగా ఏర్పడుతున్నారు. పలువురు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కళాకారులు, యువత.. ‘ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవహారం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ మౌలిక సదుపాయాలను రక్షించేందుకు యువత కదిలిరావాలని ఇరాన్ ప్రభుత్వం కోరింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపు ధోరణికి తలొగ్గమంటూ.. శాంతి చర్చలకు ఇరాన్ ద్వారాలు మూసేసింది. అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష చర్చలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా నిలిపివేసినట్లు టెహ్రాన్ టైమ్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది. ట్రంప్ పెట్టిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ముగుస్తుంది. అప్పట్లోగా హర్మూజ్ను తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమైపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతిస్పందనగా.. అమెరికా, మిత్రదేశాలు ఇరాన్ దెబ్బ రుచి చూస్తాయని పేర్కొంది. ఈజిప్టు, పాకిస్థాన్, తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టింది. శాంతి చర్చల్లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణకు అమెరికా పెట్టిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
Also Read: ఇరాన్పై భీకర దాడులు.. యుద్దంలో గెలుస్తున్నాం, ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. రాబోయే 48 గంటలపాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్మెంట్ పై అంతస్తులకు దూరంగా ఉండాలని సూచించింది. భారతీయులు ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. హైవేలపై వెళ్లాలనుకుంటే ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. రాయబార కార్యాలయం అద్దెకు తీసుకున్న హోటళ్లలో ఉంటున్న వారు .. అక్కడి దౌత్య సిబ్బందితో కాంటాక్ట్లో ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.