College Inspections: స్వేచ్ఛ బ్యూరో: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను అనుబంధ కళాశాలల్లో తనిఖీలకు సిద్ధమైంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(ఎఫ్ఎఫ్ సీ) ద్వారా నిర్వహించే ఈ తనిఖీలు ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఎఫ్ఎఫ్ సీ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా 153 కళాశాలలు తనిఖీల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12 వరకు అధికారులు అవకాశం కల్పించారు.
కళాశాలల్లో బోధనకు ఎటువంటి అంతరాయం కలగకుండా, అధ్యాపక బృందాలతో సంప్రదించి తనిఖీ తేదీలను ఖరారు చేయనున్నారు. తనిఖీ నిర్వహించే తేదీకి 48 గంటల ముందు కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందనుంది. అలాగే, తనిఖీ బృంద సభ్యులకు వారు వెళ్లాల్సిన కళాశాల వివరాలను 24 గంటల ముందు తెలియజేస్తారు. ఈ తనిఖీల్లో భాగంగా కళాశాలల్లోని మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది లభ్యత, ఇతర ప్రమాణాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, వాటి ఆధారంగానే వచ్చే విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపును మంజూరు చేయనుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా వర్సిటీ వీసీ కుమార్ మోలుగురాం కీలక అడుగు వేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్లు, సూపరింటెండెంట్లతో ఆయన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆయన పలు కీలక అంశాలను వారికి దిశానిర్దేశం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, పారదర్శకతను పెంచేందుకు, వర్సిటీ పురోగతికి పాలనా విభాగమే ఇంజిన్ వంటిదని, అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయ వేళలను ఖచ్చితంగా పాటించాలని, ఫైళ్ల కదలికలో జాప్యాన్ని పూర్తిగా నివారించాలని వీసీ ఆదేశించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ‘వెయిటింగ్’ సమయాన్ని తగ్గించాలని సూచించారు.
Also Read: తెలంగాణ బీజేపీ ఎంపీల పై కల్వకుంట్ల కవిత ఫైర్!
పరిపాలనలో పారదర్శకత, వేగం పెంచేందుకు అత్యాధునిక డిజిటల్ సాధనాలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు తమ వృత్తిపరమైన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల నాణ్యత వర్సిటీ ప్రతిష్టకు అద్దం పట్టేలా ఉండాలని దిశానిర్దేశంచేశారు. ఫైళ్ల పరిశీలనలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా వర్సిటీకి సంబంధించిన సున్నితమైన అంశాల్లో గోప్యత పాటించాలని హెచ్చరించారు. ఉన్నత విద్యా రంగంలో ఓస్మానియా విశ్వవిద్యాలయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు, ఈ సంస్కరణలను తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈనెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్ అంశంపై ఉచిత గ్రాండ్ టెస్ట్ను నిర్వహించనుంది. విద్యార్థులు కేవలం అకడమిక్ అంశాల్లోనే కాకుండా, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లోనూ రాణించాలని దీన్ని నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు స్పష్టంచేశారు. ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు విద్యార్థుల సన్నద్ధతను మెరుగుపరచడానికి ఎంతో దోహదపడతాయని చెబుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఉచితంగా రిజిస్టర్ చేసుకునే అవకాశాన్ని కూడా వర్సిటీలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ కల్పించింది.
Also read: పెళ్లి ముందు వరుడు జంప్.. అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారీ!