Iran reopens Strait of Hormuz: పశ్చిమ ఆసియాలో అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, వ్యూహాత్మకమైన హర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరాపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా అనుమతిని పునరుద్ధరించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా మధ్య జరిగిన చర్చల ఫలితంగా, హర్మోజ్ జలసంధి ఇకపై ఎప్పటికీ మూతపడదని ట్రంప్ భరోసా ఇచ్చిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి ఈ అధికారిక ప్రకటన రావడం గమనార్హం.
మరోవైపు హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో కీలకమైన ఈ సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్నారు. ఇరాన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై తక్షణ ప్రభావాన్ని చూపింది.
యుద్ధ భయంతో గత కొన్ని రోజులుగా 100 డాలర్లు దాటిన చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. బ్యారెల్ ధర 8 శాతం మేర క్షీణించి 90 డాలర్లకు పడిపోయింది. మే నెల కాంట్రాక్ట్ ఏకంగా 9.8 శాతం తగ్గి 85 డాలర్ల వద్దకు చేరింది.
ముడి చమురు ధరలు తగ్గడం వల్ల చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉండటమే కాకుండా, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు అందుతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త ఊపిరి పోసింది.
Read Also: రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు షాక్.. పౌరసత్వం వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం!