Rahul Gandhi citizenship FIR: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. రాహుల్ గాంధీ పౌరసత్వం ఆరోపణలపై అలహాబాద్ హైకోర్టు (లక్నో బెంచ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులను జారీ చేస్తూ, చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్. విగ్నేష్ శిశిర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందని, ఆయన భారత పౌరుడిగానే కాకుండా బ్రిటన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నారని ఆయన కోర్టుకు విన్నవించారు. బ్రిటన్లో రాహుల్ విన్సీ పేరుతో ఆయన ఒక కంపెనీకి డైరెక్టర్గా వ్యవహరించారని, ఆ కంపెనీ రికార్డులలో తనను తాను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని, ఒకవేళ అది నిజమైతే ఆయన ఎంపీ పదవికి అనర్హులవుతారని పిటిషనర్ వాదించారు.
అయితే, 2026 జనవరిలో లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. అయితే, విగ్నేష్ శిశిర్ ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, లోతైన దర్యాప్తు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని లేదా ఈ కేసును సీబీఐ (CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం.
మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ వంటి కీలక అంశాలపై పార్లమెంటులో రాహుల్ గాంధీ దూకుడుగా ఉన్న సమయంలో, ఈ పౌరసత్వం వివాదం వెలుగులోకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం సాంకేతిక అంశం కాదని, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన విషయం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. బీజేపీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానిస్తుండగా, ఇది కక్షసాధింపు చర్య అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Read Also: కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ