Iran response to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఉద్దేశించి చేసిన నరకం (Hellhole) వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుతూ ఇరాన్ దౌత్య కార్యాలయాలు ట్రంప్కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్ గొప్పతనాన్ని వివరిస్తూ, ట్రంప్కు ఒక కల్చరల్ డిటాక్స్ (సాంస్కృతిక ప్రక్షాళన) అవసరమని ఇరాన్ రాయబార కార్యాలయాలు ఎద్దేవా చేశాయి.
ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ X (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “బహుశా ఎవరో ఒకరు ట్రంప్ కి వన్-వే కల్చరల్ డిటాక్స్ బుక్ చేయాలేమో. అప్పుడు ఆయన చేసే ఈ అర్థం లేని బక్వాస్ (పిచ్చి మాటలు) తగ్గుతాయి. ఒకసారి భారత్ వచ్చి చూసి, అప్పుడు మాట్లాడండి” అని ఘాటుగా సమాధానమిచ్చింది. హైదరాబాద్లోని ఇరాన్ ఎంబసీ కూడా దీనికి మద్దతు తెలుపుతూ.. ముంబైలోని ‘చాయ్, బన్ మస్కా, వడ పావ్’ వంటి సామాన్యుల రుచుల గొప్పతనాన్ని కొనియాడింది. ముఖ్యంగా దక్షిణ భారతం గురించి ప్రస్తావిస్తూ, “దక్షిణ భారత్లో అడుగుపెడితే అది ‘హెవెన్ మోడ్’ (స్వర్గం) ఆన్ అయినట్లు ఉంటుంది. ఇది మీరు నమ్మే దానికంటే ఎంతో అందమైన దేశం” అని ఇరాన్ ప్రశంసల వర్షం కురిపించింది.
మరోవైపు, భారత ప్రభుత్వం కూడా ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. విదేశీ వ్యవహారాల శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం వాస్తవం కావని, అవి “అజ్ఞానంతో కూడినవి, అనుచితమైనవి. అత్యంత అసభ్యకరమైనవి” అని మండిపడ్డారు. భారత్-అమెరికా మధ్య ఉన్న సుదీర్ఘమైన పరస్పర గౌరవపూర్వక సంబంధాలకు ఇవి ప్రతిబింబం కాదని స్పష్టం చేశారు. అమెరికా ఎంబసీ ఇచ్చిన వివరణను తాము గమనించామని, అయితే ఇలాంటి వ్యాఖ్యలు దౌత్య మర్యాదలకు విరుద్ధమని భారత్ తేల్చి చెప్పింది.
అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ లేఖలో భారత్, చైనా నుండి వచ్చే వలసదారులు అమెరికాలో బర్త్రైట్ సిటిజెన్షిప్ ను దుర్వినియోగం చేస్తున్నారని, వారిని “ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు” అని సావేజ్ సంబోధించారు. ఈ దేశాలను నరకాలుగా అభివర్ణించడాన్ని ట్రంప్ సమర్థించడంపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లలకు ఇచ్చే ఆటోమేటిక్ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు చట్టపరమైన పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇలాంటి ఘాటు వ్యాఖ్యలను ఆయన ప్రోత్సహిస్తున్నారని అమెరికన్ ఎంబసీ స్పష్టం చేసింది.
Read Also: హోర్మూజ్ జలసంధి వద్ద టెన్షన్.. ఇరాన్ బోట్లను పేల్చేయండి, అలాగైతే నో చర్చలు