Strait of Hormuz Crisis: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల అల్టిమేటం నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన పంథాను స్వల్పంగా మార్చుకుంది. జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటలకే.. “శత్రువుల నౌకలు మినహా మిగిలిన అన్ని దేశాల నౌకలు హార్ముజ్ గుండా ప్రయాణించవచ్చు” అని ఇరాన్ ప్రకటించింది. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (IMO)లో ఇరాన్ ప్రతినిధి అలీ మూసవి ఆదివారం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇక్కడ శత్రువులు అంటే ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలు.
ఇరాన్ శత్రువులతో సంబంధం లేని నౌకలు.. టెహ్రాన్తో భద్రతా, రక్షణ పరమైన ఒప్పందాలు చేసుకుని జలసంధి గుండా వెళ్లవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి విభాగాలతో కలిసి సముద్రయాన భద్రతను మెరుగుపరిచేందుకు.. నావికులను రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలకు ఇజ్రాయెల్, అమెరికా దాడులే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. దౌత్యమే తమ ప్రాధాన్యత అని చెబుతూనే.. దురాక్రమణలు ఆగడం, పరస్పర విశ్వాసం పెంపొందించుకోవడం మరింత ముఖ్యమని మూసవి పేర్కొన్నారు.
ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరాలో ఐదవ వంతు ఈ హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, వారి భాగస్వామ్య దేశాలకు ఒక్క లీటరు చమురు కూడా వెళ్లనివ్వబోమని అప్పట్లో హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల భయంతో చాలా దేశాల నౌకలు ఈ ఇరుకైన మార్గం గుండా వెళ్లేందుకు సాహసించడం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా ఒక నౌకాదళ కూటమిని నిర్మించాలని ప్రయత్నిస్తోంది. అయితే నాటో (NATO) మిత్రదేశాలు మాత్రం ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వాములు కావడానికి ఆసక్తి చూపడం లేదు. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఇరాన్ తన వైఖరిని కొంత సడలించినట్లు కనిపిస్తున్నా.. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై నిషేధం కొనసాగుతుండటంతో ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు.
Read Also: Trump Iran war: ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ విషయంలో సడన్ నిర్ణయం వెనుక అసలు గుట్టు ఇదే!