AI Missile Technology: తన సైనిక సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఈ నెలలో జరగనున్న అధికార వర్కర్స్ పార్టీ తొమ్మిదో కాంగ్రెస్లో కొత్త సైనిక, నిర్మాణ లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. బుధవారం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా 50 యూనిట్ల 600mm క్యాలిబర్ మల్టిపుల్ రాకెట్ లాంచర్లను పార్టీకి కానుకగా అందజేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను జోడించి అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థల పురోగతిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ రాకెట్ లాంచర్లు ఖచ్చితత్వం, శక్తి విషయంలో హై-ప్రిసిషన్ బాలిస్టిక్ క్షిపణులకు ఏమాత్రం తీసిపోవని కిమ్ జోంగ్ ఉన్ ధీమా వ్యక్తం చేశారు. ఇవి వ్యూహాత్మక మిషన్లను పూర్తి చేయడానికి, ప్రత్యేక దాడులు నిర్వహించడానికి ఎంతో అనుకూలమైనవని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణను మరింత పటిష్టం చేసే దిశగా తొమ్మిదో కాంగ్రెస్ కొత్త దిశానిర్దేశం చేయనుందని కిమ్ స్పష్టం చేశారు. బాహ్య శక్తుల నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా తిప్పికొట్టేలా సైనిక సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
దక్షిణ కొరియా సైన్యం కూడా ఉత్తర కొరియా చేపడుతున్న ఈ ఆయుధ పరీక్షలను, కార్యకలాపాలను నిశితంగా గమనిస్తోంది. ఈ భారీ రాజకీయ సమావేశం గురువారం లేదా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సియోల్లోని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటిలో ఏఐ టెక్నాలజీతో పాటు కాంపౌండ్ గైడెన్స్ సిస్టమ్స్ను వినియోగించినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. కిమ్ పేర్కొన్న ‘వ్యూహాత్మక మిషన్’ అనే పదం ఈ లాంచర్లు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయనే విషయాన్ని సూచిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ఉత్తర కొరియా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ భూభాగంలోకి డ్రోన్లను పంపిన ఘటనపై దక్షిణ కొరియా విచారం వ్యక్తం చేయడాన్ని కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ స్వాగతించారు. సార్వభౌమాధికార ఉల్లంఘనలు మళ్లీ జరగకుండా చూసుకోవడం దక్షిణ కొరియాకే శ్రేయస్కరమని ఆమె హెచ్చరించారు. శత్రువులతో ఉన్న సరిహద్దులు ఎప్పుడూ పటిష్టంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. సరిహద్దుల్లో నిఘాను పెంచేందుకు సైన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Read Also: Nigeria Mine Accident: నైజీరియాలో పెను విషాదం.. నిముషాల్లోనే 37 మంది బలి