Pak Economic Crisis: దయాది దేశం పాకిస్థాన్ (Pakistan) దివాళ దిశగా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నడిపేందుకు సైతం డబ్బుల్లేక మిత్ర దేశాలను, ప్రపంచ బ్యాంక్ (World Bank), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)ను పాక్ ఆర్థిక సాయం కోరుతోంది. ఈ క్రమంలో డబ్బు పుట్టక.. తమ దేశంలోని అంతర్జాతీయ విమానశ్రయాలను సైతం తాకట్టు పెట్టేందుకు పాక్ సిద్ధమైనట్లు ఇటీవల వార్తలు సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే తమ దేశం ఎదుర్కొంటున్న దౌర్భాగ్య ఆర్థిక పరిస్థితిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) స్వయంగా అంగీకరించారు. మిత్ర దేశాలను అప్పులు అడగటం తనకే సిగ్గుగా ఉందని వ్యాఖ్యానించారు.
శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ లోని పాక్ అగ్రశ్రేణి ఎగుమతిదారులను ఉద్దేశించి షెహబాద్ షరీఫ్ మాట్లాడారు. పాకిస్థాన్ విదేశీ ద్రవ్య నిల్వల పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెబుతూనే.. మిత్ర దేశాల నుంచి అప్పు రూపంలో వాటిని సమకూర్చినట్లు తెలిపారు. పాక్ విదేశీ మారక నిల్వలు రెట్టింపు అయ్యాయన్న షెహబాజ్.. కానీ తమ స్నేహితులు, మిత్ర దేశాల రుణాలు కూడా ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సాయం కోరేందుకు ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తో కలిసి తాను పడిన ఇబ్బందులను సైతం పాక్ ప్రధాని ఈ సమావేశంలో ప్రస్తావించారు.
How appropriate is it for our prime minister to go on camera and admit that the country is begging for loans and aid?
This isn’t strength or honesty — it’s a painful admission that the truth can no longer be hidden.#Pakistan’s economy is collapsing.@81ShahbazRana @JiqbalPK pic.twitter.com/QvjilmuVEN
— Imtiaz Abbasi (@ImtiazAbbasi751) January 31, 2026
పాక్ ప్రధాని మాట్లాడుతూ ‘ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, నేను అప్పు కోసం ప్రపంచ దేశాలు తిరగడం చూసి సిగ్గుగా అనిపించింది. సాయం చేసే క్రమంలో వారు పెట్టిన షరతులకు మేం నో చెప్పలేకపోయాం’ అని చెప్పుకొచ్చారు. మూల ధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కేంద్ర బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వశాఖను తన ప్రభుత్వం ఆదేశించిందని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాక్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్.. పారిశ్రామిక వేత్తల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని షెహబాజ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక స్థిరత్వం సాధించిందని.. ఇప్పుడు ఉపాధిని సృష్టించి పేదరికాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇదే విషయాన్ని ఐఎంఎఫ్ కు సైతం పాక్ బృందం తెలియజేసిందని పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ లో డిసెంబర్ నాటికి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 20 బిలియన్ డాలర్లు దాటుతాయని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ఈ వారం ప్రారంభంలో అంచనా వేసింది. అదే సమయంలో పాకిస్థాన్ కఠినమైన ద్రవ్య విధానాన్ని కొనసాగించాలని, వృథా ఖర్చులను నియంత్రించాలని షెహబాజ్ ప్రభుత్వానికి సూచించింది. అలా చేస్తే జనవరి – జూన్ మధ్య దేశ జీడీపీ వృద్ధి రేటు 3.75 – 4.75 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.