పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న ఆయన కుడి కన్ను ‘సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్’ (CRVO) అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి తక్షణమే మెరుగైన చికిత్స అందించకపోతే ఆయన శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ హెచ్చరించింది.
జైలు నిబంధనలు – వైద్యుల సూచనలు..
జైలులో ఇమ్రాన్ ఖాన్ను పరీక్షించిన నిపుణులు, ఈ కంటి సమస్య అత్యంత సున్నితమైనదని, దీనికి ఆపరేషన్ థియేటర్, ప్రత్యేక వైద్య సదుపాయాలు అవసరమని సూచించినట్లు పీటీఐ తెలిపింది. అయితే, జైలు అధికారులు మాత్రం ఆయనను జైలు లోపలే ఉంచి చికిత్స అందించాలని పట్టుబట్టడంపై పార్టీ మండిపడింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఆయన ప్రాణాలతో, ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ను వెంటనే ఆయనకు ఇష్టమైన ఆసుపత్రికి (షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి వంటివి) తరలించాలని డిమాండ్ చేసింది.
కోర్టు ఆదేశాల ఉల్లంఘన..
ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, గత ఏడాది అక్టోబర్ నుంచి ఇమ్రాన్ ఖాన్ను ఆయన వ్యక్తిగత వైద్యుడు కలవకుండా అడ్డుకుంటున్నారని పీటీఐ పేర్కొంది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లు ఆగస్టు 2025 నుండి పెండింగ్లో ఉన్నాయని, ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కుటుంబ సభ్యుల సందేహాలు..
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖానుమ్, నొరీన్ ఖానుమ్ జైలు అధికారుల తీరును తప్పుపట్టారు. తమకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని వారు పేర్కొన్నారు. ‘ఈ వార్తలు నిజమైతే మాకు ఎందుకు చెప్పలేదు? అసలు ఈ సమాచారం బయటకు ఎలా వచ్చింది?’ అని అలీమా ఖానుమ్ ప్రశ్నించారు. కేవలం సమాచార లీకేజీలతో గందరగోళం సృష్టించడం కాకుండా, ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పీటీఐ చైర్మన్ బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో కొత్త పిటిషన్ వేశారు. జైలులో ఉన్న ఖాన్ మరియు ఆయన భార్య బుష్రా బీబీ ఇద్దరి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, మే 9 అల్లర్ల కేసులో ఇమ్రాన్ ఖాన్కు, తోషాఖానా కేసులో బుష్రా బీబీకి మధ్యంతర బెయిల్ను కోర్టు ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది
ALSO READ: IND VS NZ 4th T20: చెలరేగిన న్యూజిలాండ్…ఇండియా ముందు భారీ టార్గెట్..ఎంతంటే ?