Ali Malik praises India: సాధారణంగా భారత్పై విమర్శలు చేసే పాకిస్థాన్.. తాజాగా మన దేశ ఆర్థిక పటిష్టతను కొనియాడింది. ఇరాన్ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగినా, భారత్ మాత్రం ధరలను నియంత్రించి సామాన్యుడిపై భారం పడకుండా కాపాడింది. ఈ వ్యూహాన్ని చూసి పాక్ పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరినప్పటికీ భారత్ తన దేశంలో ఇంధన ధరలను పెంచకపోవడాన్ని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ మాలిక్ కొనియాడారు. పాకిస్థాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని భారత్ లోని స్థిరమైన పరిస్థితులతో పోల్చుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావాన్ని సామాన్య ప్రజలపై పడకుండా న్యూఢిల్లీ ప్రభుత్వం ఏవిధంగా రక్షించగలిగిందో ఆయన వివరించారు.
పాకిస్థాన్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) విధించిన కఠినమైన బెయిలౌట్ నిబంధనల కింద ఉందని.. కానీ భారత్ వద్ద 600 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) ఉండటం వారికి కలిసి వచ్చిందని మాలిక్ పేర్కొన్నారు. భారత్ కేవలం ఆర్థిక నిల్వలే కాకుండా అత్యవసర సమయాల కోసం స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ కూడా నిర్వహిస్తోందని ఆయన ఒక స్థానిక వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ధరలు పెరుగుతున్న సమయంలో పన్నులను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణ సెగ ప్రజలకు తగలకుండా భారత్ అడ్డుకోగలిగిందని.. ఆ స్థాయి ఆర్థిక వెసులుబాటు వారికి ఉందని ఆయన విశ్లేషించారు.
మరోవైపు పాకిస్థాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అలీ మాలిక్ అంగీకరించారు. తమ వద్ద కేవలం 5 నుండి 7 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. రిఫైన్డ్ ఉత్పత్తులు కూడా 20-21 రోజులకు మించి రావని పేర్కొన్నారు. భారత్ లాగా తమ వద్ద 60-70 రోజులకు సరిపడా నిల్వలు లేవని.. భారత్ కేవలం ఒక సంతకంతో ఆ నిల్వలను విడుదల చేసి ధరలను నియంత్రించగలదని ఆయన అసూయ వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ ఒప్పందాల ప్రకారం ఇంధనంపై లెవీ విధించాల్సి ఉన్నప్పటికీ.. డీజిల్ ధరలు 3-4 రెట్లు పెరగడంతో తమ వ్యూహాన్ని మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గతంలో పెట్రోల్ ధరను లీటరుకు 80 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని.. అయితే ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల వల్ల ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని మాలిక్ గుర్తు చేశారు. ఐఎంఎఫ్ నమ్మకాన్ని కాపాడుకుంటూనే దౌత్యపరమైన చర్చల ద్వారా లెవీని తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడటమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మోటార్ సైకిలిస్టుల కోసం ప్రత్యేక సబ్సిడీని అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ