పహల్గాం అటాక్ తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకారానికి భారత్ ప్రయత్నిస్తోంది. పాక్ కు సింధూ జలాల్ని నిలిపివేసింది. ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. విమాన సర్వీసుల్ని ఆపివేసింది. పాకిస్తాన్ వాసుల్ని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేసింది. మరి పాక్ ఏం చేస్తోంది. పాక్ చర్యలు చెప్పుకుంటే మరీ కామెడీగా ఉంటుంది. అవును, ఇది నిజం. పహల్గాం అటాక్ తర్వాత భారత చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ మన బాలీవుడ్ పాటలపై కక్ష తీర్చుకుంటోంది. పాకిస్తాన్ లోని అన్ని ఎఫ్ఎం రేడియో స్టేషన్లలో బాలీవుడ్ పాటల ప్రసారం నిలిపివేశారట. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పాకిస్తాన్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ని ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అభినందించడం మరో కామెడీ.
అల్ప సంతోషం..
పాకిస్తాన్ వాసులకు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రధానంగా బాలీవుడ్ సినిమాలే. ఇక్కడి సినిమాలకు అక్కడ చాలామంది అభిమానులు. అంతేనా, లతా మంగేష్కర్, మహ్మద్ రఫి, కిషోర్ కుమార్, ముకేష్.. ఇలాంటి గాయకులకు అక్కడ హార్డ్ కోర్ అభిమానులున్నారు. వీరి పాటలకే పాకిస్తాన్ లో క్రేజ్ ఎక్కువ. అందుకే అక్కడి ఎఫ్ఎం రేడియోల్లో కూడా నిన్నటి తరం బాలీవుడ్ పాటలు మారుమోగిపోతుంటాయి. అయితే ఉన్నట్టుండి ఆ పాటల్ని ఎఫ్ఎం ఛానెళ్లు ఆపివేశాయి. కారణమేంటి అంటే..? భారత్ తమపై ఆంక్షలు విధిస్తున్నందుకు ప్రతిగా వారి పాటలపై తాము ఆంక్షలు పెట్టామని చెబుతున్నారు పాకిస్తాన్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. పీబీఏ సెక్రటరీ జనరల్ షకీల్ మసూద్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అభినందనలు..
ఎఫ్ఎం స్టేషన్లలో బాలీవుడ్ పాటల్ని ఆపివేయడాన్ని ఒక గొప్ప ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భావించడం పెద్ద విశేషం. పీబీఏ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ అభినందించారు. ఇది ఒక గొప్ప దేశభక్తిని చాటి చెబుతోందని అన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పీబీఏకి అభినందనలు అని చెప్పారు.
ఇంకేం చేస్తారు..?
ఉగ్రవాదుల్ని ఉసిగొల్పి తప్పుచేసింది పాకిస్తాన్. దానికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఊరుకుంటుందా..? ఉగ్రదాడికి తమకు సంబంధం లేదని చెబితే అదోరకం. కానీ పాకిస్తాన్ మాత్రం మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతోంది. పాకిస్తాన్ మంత్రులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని పునర్నిర్మిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతకు మించి పాకిస్తాన్ చేయడానికేమీ లేదు. భారత్ ని దౌత్యపరంగా అడ్డుకోలేదు, అలాగని భారత్ ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ కి మాత్రమే పరిమితమైన వనరులు కూడా ఏవీ లేవు. అందుకే కేవలం నోటికి పనిచెబుతున్నారు పాకిస్తాన్ పాలకులు. ఉగ్రవాదులకు మద్దతిస్తూ కాశ్మీర్ లో అశాంతి రేకెత్తించి అల్లకల్లోలం సృష్టించాలనేది పాకిస్తాన్ ప్లాన్. అదే సమయంలో భారత్ లో మత కల్లోలాలు చెలరేగేలా చేయాలనేది కూడా వారి దుర్మార్గపు ఆలోచన. ఈ ప్లాన్ ని భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమం మొదలు పెట్టింది. సైన్యానికి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి మరీ మట్టుబెడతామని హోం మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ నుంచి ఇంత తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సమయంలో పాకిస్తాన్ మాత్రం బాలీవుడ్ పాటల్ని ఎఫ్ఎం స్టేషన్లలో ప్లే చేయకుండా నిషేధించి అదోరకమైన శాడిజాన్ని ప్రదర్శిస్తోంది.