PM Narendra Modi Russia tour updates(Current news in World): రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి విశిష్ట ఘనత లభించింది. రష్యా అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది పోస్టల్’ను ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2019లోనే మోదీకి ఈ అవార్డును ప్రకటించగా.. తాజాగా, ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ, బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించినట్లు పుతిన్ పేర్కొన్నారు. ఈ పురస్కారంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని ఓ పోస్ట్ చేశారు. రష్యా ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అవార్డు 140 కోట్ల మంది ప్రజలకు అంకితం ఇస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.
అంతకుముందు పుతిన్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని ఉద్ఘాటించారు. వాణిజ్యం, భద్రత, వ్యవసాయం, సాంకేతికత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై అవగాహన కుదుర్చుకున్నారు.
ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రధాని అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఒంటరిగా రష్యాకు రాలేదని..140 కోట్ల భారతీయుల ప్రేమతో వచ్చానన్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మాస్కోలోని ఒక యుద్ధ స్మారక చిహ్నం వద్ద రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలు ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. అనంతరం ఆస్ట్రియాకు వెళ్లనున్నారు.