H1B Extension Fee: అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ మరో బిగ్ షాక్ ఇచ్చే పనిలో పడింది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసాలపై అమెరికాకు వెళ్లే వారిపైనే కాకుండా.. అక్కడ పనిచేస్తూ వీసా కాలాన్ని పొడిగించుకునే వారిపై కూడా అదనపు రుసుములు విధించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించి కొత్త రూల్స్ తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.
అమెరికాలో 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి.. వారిలో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు (విదేశీ ఉద్యోగులు) ఉన్న కంపెనీలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ప్రస్తుతం ఈ తరహా సంస్థలు కొత్త వీసాలు ఇచ్చినప్పుడు లేదా ప్రాజెక్ట్ కోసం మరో బ్రాంచ్ కు ఉద్యోగిని మార్చినప్పుడు మాత్రమే ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు’ కింద హెచ్-1బీ వీసాకు 4,000 డాలర్లు (రూ.3,81,283), ఎల్-1 వీసాకు 4,500 డాలర్లు (రూ.4,28,944) అదనంగా చెల్లిస్తున్నాయి. అయితే ఇకపై ఉద్యోగుల వీసా గడువు పెంపు దరఖాస్తులకు కూడా ఈ రుసుమును తప్పనిసరి చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS), డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ (DOL), డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ (DOS) భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన తుది నిబంధనలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నివేదిక ప్రకారం.. అమెరికాలో ఆమోదం పొందుతున్న హెచ్-1బీ దరఖాస్తుల్లో అత్యధికం పాత ఉద్యోగుల వీసాల పొడిగింపునకు సంబంధించినవే. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4.06 లక్షల హెచ్-1బీ వీసాలకు ఆమోదాలు లభిస్తే.. అందులో దాదాపు 2.9 లక్షలు (71 శాతం) పాత ఉద్యోగాల కొనసాగింపునకు చెందినవే ఉన్నాయి. ఇందులోనూ దాదాపు 2.2 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అంటే మొత్తం వీసా పొడిగింపుల్లో భారతీయుల వాటానే 78 శాతంగా ఉంది. కాబట్టి ఈ అదనపు ఫీజు భారం పడితే.. భారతీయ నిపుణులను కొనసాగించడం అమెరికన్ ఐటీ కంపెనీలకు మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది.
Also Read: మళ్లీ వివాదంలో టెలిగ్రామ్.. ఈసారి యాపిల్ స్టోర్ నుంచి అవుట్.. అసలేం జరుగుతోంది!
నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) నివేదిక ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్న ఉద్యోగుల హెచ్-1బీ వీసాలను అత్యధికంగా పొడిగించుకున్న సంస్థల్లో ‘అమెజాన్’ (14,532 ఆమోదాలు) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ – టీసీఎస్ (5,293), మైక్రోసాఫ్ట్ (4,863), మెటా ప్లాట్ఫార్మ్స్ (4,740), యాపిల్ (4,610), గూగుల్ (4,509) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఒకే ఉద్యోగి వేర్వేరు ప్రాజెక్టుల కోసం ప్రాంతాలు మారినప్పుడు వీసా ఆమోదం పొందాల్సి రావడం వల్ల ఈ సంఖ్య.. ఉద్యోగుల కంటే కాస్త ఎక్కువగా కనిపిస్తోందని రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ.. కొత్త వీసా ఛార్జీలు అమల్లోకి వస్తే టెక్ కంపెనీల వ్యయం భారీగా పెరగనుందని అర్థమవుతోంది.
Also Read: ఇస్త్రీ బల్లపై అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే ఆశ్చర్యమే!