Singapore News: కష్టపడటానికి ఇష్టంలేని కొందరు వ్యక్తులు, సుఖంగా జీవించడానికి ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్లినా తమ పంథాను వదులుకోరు. ఫలితంగా దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. విహారయాత్రకు సింగపూర్ వెళ్లిన ఇద్దరు భారతీయులు అడ్డంగా బుక్కయ్యారు. సెక్స్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు, దోపిడీకి పాల్పడినందుకు స్థానిక కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంతకీ నిందితులు ఏం చేశారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
సింగపూర్ హోటల్లో ఇద్దరు ఇండియన్స్
ఈ ఏడాది ఏప్రిల్ నాలుగోవారంలో విహారయాత్కు భారత్ నుంచి సింగపూర్ వెళ్లారు ఇద్దరు యువకులు. ఆరోక్కియసామి డైసన్ వయస్సు 23 ఏళ్లు, రాజేంద్రన్ మయిలరసన్ 27 ఏళ్లు. వీరిద్దరు అక్కడ ఎలాంటి జల్సాలు చేశారో తెలీదు. పరిస్థితులు చేయి దాటిపోవడంతో రెండు రోజుల తర్వాత లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ అపరిచిత వ్యక్తి ద్వారా ఇద్దరు సెక్స్ వర్కర్ల ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వారి నుంచి డబ్బులు దోచుకోవాలని ప్లాన్ చేశారు.
సరిగ్గా ఏప్రిల్ 26న ఓ మహిళను హోటల్ గదికి రప్పించారు. ఆమె రాగానే ఇద్దరు యువకులు దాడి చేశాడు. ఆమె వద్దనున్న 2 వేల సింగపూర్ డాలర్లు, పాస్పోర్ట్, బ్యాంక్ కార్డులను దోచుకున్నారు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మరో మహిళను వేరే హోటల్కు రప్పించారు వీరిద్దరు. అక్కడ కూడా ఆమెకు ఆ తరహా ట్రీట్మెంట్ ఇచ్చి 800 సింగపూర్ డాలర్ల నగదు, పాస్పోర్ట్ను లాక్కున్నారు.
మహిళలను హోటల్కు పిలిచి ఆపై
తాము తిరిగి వచ్చే వరకు గది విడిచి వెళ్లొద్దని బెదిరించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఒకే రోజు రెండు హోటల్లో భారతీయ టూరిస్టులు ఆ పని చేయడం, మరుసటి రోజు వెలుగులోకి రావడం జరిగిపోయింది. హోటల్లో తనకు జరిగిన అన్యాయం గురించి ఓ వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. విచారణ చేపట్టారు అక్కడి స్థానిక పోలీసులు.
మహిళలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో నిందితులిద్దరూ తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. అందుకు పలు కారణాలు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేరానికి పాల్పడ్డామని, తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు.
ALSO READ: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల ప్రదర్శించిన థియేటర్లపై దాడి
నా తండ్రి గతేడాది మరణించారని, తనకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారని నిందితులు వివరించాడు. ఒకరికి వివాహం అయ్యిందని, మా దగ్గర డబ్బు లేక ఇలా చేశామని ఆరోక్కియసామి అన్నాడు. నా భార్య, బిడ్డ భారత్లో ఒంటరిగా ఉన్నారని, వారక్కడ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రన్ చెప్పుకొచ్చాడు.
వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ నేరం తీవ్రతను బట్టి కఠిన శిక్ష విధించింది న్యాయస్థానం. సింగపూర్ చట్టాల ప్రకారం ఈ తరహా ఘటనలు పాల్పడినవారికి 5 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం 12 కొరడా దెబ్బలు విధిస్తారు. ఇద్దరు యువకులు తమ సమస్యలు చెప్పుకోవడంతో ఐదేళ్ల జైలు శిక్ష, 12 కొరడా దెబ్బలు విధిస్తూ సింగపూర్ స్థానిక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.