US Halts Satellites Service Ukraine War| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఊహించని పరిణామంపై కన్నెర్ర చేస్తున్న అమెరికా, ఇప్పుడు ఉక్రెయిన్కు అందిస్తున్న వివిధ రకాల సహాయాలను తగ్గించే ప్రక్రియలో పడింది. ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఉక్రెయిన్కు అందించే నిఘా సమాచారాన్ని నిలిపివేసింది. తాజాగా.. అమెరికా ఏరోస్పేస్ సంస్థ ‘మక్సార్’ కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. యుద్ధ సమయంలో కీలకమైన శాటిలైట్ చిత్రాలను ఉక్రెయిన్ సైన్యానికి అందించడం నిలిపివేయబడిందని ఉక్రెయిన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత, జెలెన్స్కీ ప్రభుత్వానికి అమెరికా కీలకమైన నిఘా సమాచారాన్ని అందిస్తోంది. రష్యా దండయాత్ర ప్రారంభించే ముందు వారం నుండే ఈ సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. ముఖ్యంగా, యుద్ధ సమయంలో కీలకమైన శాటిలైట్ చిత్రాలను అమెరికా సంస్థ ‘మక్సార్’ ఉక్రెయిన్ సైన్యానికి అందిస్తోంది. దీని వల్ల ఉక్రెయిన్ సైన్యం రష్యా బలగాలను ఎదుర్కోవడంలో సహాయపడుతోంది. ఇప్పుడు ఈ సహాయం నిలిపివేయడంతో, జెలెన్స్కీ సైన్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్ అణ్వాయుధాలు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్కు నిఘా సమాచారం అందించడం నిలిపివేయడంపై ఇటీవల స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్, ఉక్రెయిన్తో ఉన్న సంబంధాలను ట్రంప్ పరిపాలన సమీక్షిస్తోందని తెలిపారు. ఈ చర్యలు తాత్కాలికమా లేదా శాశ్వతమా అనే విషయంలో ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇలా రష్యాతో యుద్ధంలో కీలకమైన నిఘా సమాచారాన్ని అమెరికా నిలిపివేసిన నేపథ్యంలో, ఉక్రెయిన్కు తమ మద్దతు కొనసాగుతుందని ఫ్రాన్స్ ప్రకటించింది. తాము ఎప్పటికప్పుడు నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్తో పంచుకుంటామని ఫ్రాన్స్ తెలిపింది.
జెలెన్స్కీకి పెరిగిన ప్రజామద్దతు
ట్రంప్, జెలెన్స్కీ మధ్య ఇటీవల వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉక్రెయిన్లో జెలెన్స్కీకి ప్రజల మద్దతు లేదని, ఆయన ఒక నియంత అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. అనేక సంస్థలు ఉక్రెయిన్లో జెలెన్స్కీకి ఉన్న మద్దతుపై సర్వేలు నిర్వహించాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం.. ట్రంప్తో వాగ్వాదం తర్వాత జెలెన్స్కీకి ప్రజామద్దతు 10 శాతం పెరిగింది.
కీవ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ (KIIS) నిర్వహించిన సర్వేలో.. 67 శాతం ఉక్రెయిన్ ప్రజలు తాము జెలెన్స్కీని విశ్వసిస్తున్నామని తెలిపారు. ఇది మునుపటి 57 శాతం నుండి 10 శాతం పెరిగినది. ట్రంప్తో జరిగిన ఘర్షణ తర్వాత, జెలెన్స్కీకి ప్రజామద్దతు పెరిగిన విషయం స్పష్టమైంది. ట్రంప్ యొక్క దురుసు ప్రవర్తనతో తమ నాయకుడిని అవమానించినట్లు భావించిన ప్రజలు, జెలెన్స్కీకి మరింత మద్దతు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయని తెలిసిందే. తర్వాత, ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ జెలెన్స్కీని ఒక నియంతగా వర్ణించారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కొంత భూమిని కోల్పోయినందుకు యుద్ధం వరకు వెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు ఎక్కువ భూమి మరియు ప్రజల ప్రాణాలను కోల్పోయారని ట్రంప్ మండిపడ్డారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, యుద్ధం ప్రారంభించే ముందే సంధి చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. జెలెన్స్కీకి తమ దేశంలో ప్రజామద్దతు కేవలం 4 శాతం మాత్రమే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను జెలెన్స్కీ తిరస్కరించారు.