Trump Iran talks Pakistan resumption: అమెరికా-ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ చర్చలు విఫలమైనప్పటికీ, రాబోయే రెండు రోజుల్లో పాకిస్థాన్ వేదికగా తిరిగి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “వచ్చే రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు, మేము అక్కడికి వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాం.” అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్ తన పంథాను మరింత కఠినతరం చేస్తూ పొరుగు అరబ్ దేశాల నుండి నష్టపరిహారం డిమాండ్ చేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
అమెరికా ఇజ్రాయెల్ తమపై చేస్తున్న దాడులకు సహకరిస్తున్నాయనే ఆరోపణలతో బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, జోర్డాన్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడింది. ఈ దేశాలు అమెరికా దురాక్రమణకు మార్గం సుగమం చేశాయని, కాబట్టి ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ‘స్వీయ రక్షణ’ (Article 51) పేరుతో అవి తమపై దాడులకు దిగే హక్కు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్కు ఇరాన్ రాయబారి అమీర్ సయ్యద్ ఇరవానీ లేఖ రాశారు. అరబ్ దేశాలు తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం ద్వారా ఇరాన్ యుద్ధ వాతావరణాన్ని మరింత క్లిష్టతరం చేసింది.
ఇస్లామాబాద్ శాంతి చర్చల విఫలం తర్వాత హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అందుకు ప్రతిసవాల్ విసిరారు. ఈ వ్యూహాత్మక మార్గం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని, తమ దరిదాపుల్లోకి వచ్చే అమెరికా యుద్ధ నౌకలపై నిర్ణయాత్మక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన భారీ దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య నేరుగా చర్చలు జరిపేందుకు అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రాంతీయంగా శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం ‘అణు కార్యకలాపాల నిలిపివేత’ (Suspension of nuclear activity) గడువు అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అణు కార్యక్రమాలను 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించగా, ఇరాన్ మాత్రం కేవలం 5 ఏళ్లకు మాత్రమే అంగీకరిస్తోంది. గత ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన చర్చలు కూడా ఇదే కారణంతో నిలిచిపోయాయి. ఇప్పుడు త్వరలో జరగబోయే చర్చల్లో ఈ అంశంపై ఏదైనా పురోగతి కనిపిస్తుందా అనేది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ముఖ్యంగా చమురు మార్కెట్లకు అత్యంత కీలకం కానుంది.
Read Also: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్..