PM Modi Donald Trump Phone Call: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ఫోన్లో సుమారు 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా సంభాషించారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, ఇరు నేతల మధ్య జరిగిన మొదటి అధికారిక సంభాషణ ఇదే. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో ఈ చర్చలు జరగడం గమనార్హం.
ఈ ఫోన్ కాల్లో ఇరు దేశాల నేతలు ప్రధానంగా పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులపై చర్చించారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరిచి ఉంచడం, దాని భద్రతను నిర్ధారించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమని ఇరువురు నొక్కి చెప్పారు.
ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కూడా ఇరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రంగాలలో భారత్-అమెరికా మధ్య జరుగుతున్న గణనీయమైన పురోగతిని వారు సమీక్షించారు. “మా మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్ని రంగాలలో మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) ద్వారా తెలిపారు. గతేడాది మార్చి 24న జరిగిన చర్చల్లో కూడా పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ, ఉద్రిక్తతల తగ్గింపునకు భారత్ మద్దతు ఇస్తుందని మోదీ స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు ఐదో వంతు ప్రయాణించే కీలక మార్గం. ఇక్కడ దిగ్బంధం లేదా యుద్ధం సంభవిస్తే భారత్ వంటి దేశాలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుంది. అందుకే, ఈ మార్గం సురక్షితంగా ఉండాలని ట్రంప్, మోదీ నిర్ణయించడం అంతర్జాతీయ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చే అంశం.
Read Also: రీల్స్ పిచ్చి ప్రాణం తీసింది.. స్పోర్ట్స్ బైక్పై విన్యాసాలు చేస్తూ 19 ఏళ్ల యువతి మృతి!