US Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో ఒక గూఢచారి ఉన్నారని ఆరోపించారు. ఇరాన్లో కూలిపోయిన ఫైటర్ జెట్ ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ పైలట్ను కాపాడేందుకు అగ్రరాజ్యం భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ వివరాలను గుర్తుతెలియని వ్యక్తి ఇరాన్ కు లీక్ చేశారని ట్రంప్ సీరియస్ అయ్యారు. యూఎస్ సైన్యం ఆపరేషన్ గురించి సోమవారం మాట్లాడుతూ.. ట్రంప్ తమ గూఢచారి వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ లో ఎఫ్-15ఈ జెట్ కూలిన తర్వాత ఒక పైలట్ను అమెరికా బలగాలు రక్షించాయని ట్రంప్ చెప్పారు. రెండో పైలట్ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయని ఓ వార్త సంస్థ కథనంతో ఇరాన్ కు సమాచారం లీక్ అయిందన్నారు. దీంతో ఆపరేషన్ మరింత కష్టమైందన్నారు. ఈ కథనం రాసిన వార్తా సంస్థకు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమాచారం ఎవరిచ్చారో చెప్పకుంటే ఆ జర్నలిస్టును జైలు పంపిస్తామన్నారు. అయితే ఆ జర్నలిస్టు, వార్త సంస్థ పేరు గానీ ట్రంప్ చెప్పలేదు.
సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ట్రంప్ తెలిపారు. అమెరికా సైన్యం రెండో పైలట్ కోసం గాలిస్తున్నాయని వార్త బయటకు రావడంతో ఇరాన్ అలర్ట్ అయిందన్నారు. ఆ పైలట్ను పట్టుకున్నవారికి భారీగా బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటన చేసిందన్నారు. గూఢచర్యానికి పాల్పడిన వ్యక్తి ఒక మానసిక రోగిగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కనిపెట్టితీరుతామన్నారు. ఎఫ్-15 ఈగల్ పైలట్ను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ లో 155 విమానాలు పాల్గొన్నాయన్నారు. నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 రీఫ్యూయలింగ్ విమానాలు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నట్లు ట్రంప్ చెప్పారు.
హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్కు విధించిన గడువు దగ్గర సమీపిస్తుండటంతో ట్రంప్ మంగళవారం మరో ప్రకటన చేశారు. ఈ రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుందని మరోసారి హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా రైల్వేలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలతో సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు చెప్పారు. “ఈ రాత్రికి ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది, దాన్ని మళ్లీ తిరిగి తీసుకురాలేము. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అది జరగవచ్చు” అని ట్రంప్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో, ఇరాన్ మంగళవారం చర్చలను నిలిపివేసింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్ బెదిరింపులపై స్పందించాయి. ట్రంప్, ఆయన మిత్ర దేశాలు ఇరాన్ నుంచి మరచిపోలేని దెబ్బను తింటారని హెచ్చరించాయి. అయితే మంగళవారం నాడు ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ చమురు రంగానికి ఈ ద్వీపం చాలా కీలకం. ఆ దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఈ ద్వీపం గుండానే జరుగుతాయి.
Also Read: ఇరాన్పై భీకర దాడులు.. యుద్దంలో గెలుస్తున్నాం, ట్రంప్ కీలక ప్రకటన