US Attack Venezuela: వెనిజులా రాజధాని కరాకస్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. శనివారం తెల్లవారుజామున యూఎస్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఆ దేశా మీడియా ఆరోపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనెజువెజులాపై దాడులు చేయాలని ఆదేశించారని అమెరికా అధికారులు ధృవీకరించిన కొద్దిసేపటికే.. బాంబులు పేలుళ్లు జరిగాయి.
వెనిజులాపై అమెరికా ఎయిర్ ఫోర్స్ దాడులు ప్రారంభించింది. రాజధాని కరాకస్ సహా సైనిక స్థావరాలపై దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడులకు ఆదేశించారని స్థానిక మీడియా నివేదికలు అందుతున్నాయి. కరాకస్లోని దాదాపు ఏడుచోట్ల బాంబు పేలుళ్లు వినిపించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
వెనిజులా రాజధాని కరాకస్ పై జరిగిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించి, యూఎస్ కు తరలిస్తున్నాయని వెల్లడించారు. మదురోతో పాటు ఆయన భార్యను కూడా నిర్భంధించినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ ప్రకటన చేశారు.
“యూఎస్ఏ వెనిజులాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోపై పెద్ద ఎత్తున దాడి చేసింది. దాడుల అనంతరం మదురోతో పాటు అతడి భార్యను బంధించి యూఎస్ కు తరలిస్తున్నాం. ఈ ఆపరేషన్ యూఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించింది” అని ట్రంప్ పేర్కొన్నారు.
వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి దాడులు చేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెనిజులా నుంచి డ్రగ్స్ అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ ఇటీవల పలుమార్లు పేర్కొన్నారు. ఈ ముఠాలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలున్నాయని ఆరోపించారు. మదురో ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ ప్రణాళికలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది.
US forces have bombed the Port of La Guaira in Northern Venezuela tonight. pic.twitter.com/1l5pUnojV7
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 3, 2026
అమెరికా దాడులను వెనిజులా ప్రభుత్వం ఖండించింది. అమెరికా చాలా తీవ్రమైన సైనిక దాడికి పాల్పడిందని ఆరోపించింది. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం ఖండిస్తుందని పేర్కొంది. కరాకస్ నగరం, మిరాండా, అరగువా, లా గుయిరా రాష్ట్రాలలో పౌరులు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని వెనిజులా తెలిపింది. అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ సైన్యాధికారులు చెబుతున్నారు. దాడి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణ సమావేశానికి పిలుపునిచ్చింది.
ఇటీవల అమెరికా.. వెనిజులాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాలను తీసుకువెళుతున్నట్లు చెబుతున్న 30కి పైగా నౌకలపై దాడులు చేసింది. ఈ దాడులలో 110 మందికి పైగ మృతి చెందారు. మదురో ప్రభుత్వం డ్రగ్స్ ముఠా, ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తుందని ట్రంప్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మదురో ఖండించారు.