Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా, ఇటీవల తిరుపతిలో తల నీలాలు ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. రష్యా దేశానికి చెందిన అన్నా లెజినోవా (Anna Lezhneva)కు భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాల పట్ల ఎంతో గౌరవం ఉంది. రష్యాలో పుట్టినప్పటికీ, మన తెలుగు ఇంటి కోడలిగా ఇక్కడి ఆచారాలను గౌరవిస్తూ, పవన్ కళ్యాణ్ వెనుక ఒక బలమైన శక్తిగా ఆమె నిలుస్తున్నారు. ఇటీవల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదానికి గురైనప్పుడు, తిరుమలేశుని మొక్కుకుని, ఆ మొక్కును తీర్చుకున్నారు. ఆ సమయంలో ఆమెపై కొందరు రకరకాలుగా కామెంట్స్ చేసినా, అవేమీ పట్టించుకోకుండా, తన కుమారుడిని ఆ కలియుగ దైవమే కాపాడారని ఆమె తలంచారు. తాజాగా ఆమె మరోసారి హిందూ దేవాలయంలో సందడి చేశారు.
Also Read- Mohan Babu: విద్యార్థి నాయకులపై మోహన్ బాబు అనుచరులు దాడి, కిడ్నాప్.. తిరుపతిలో ఏం జరుగుతోంది?
చారిత్రాత్మక వరంగల్ నగరంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం భద్రకాళి అమ్మవారిని (Warangal Bhadrakali Temple) అన్నా లెజినోవా మంగళవారం దర్శించుకున్నారు. అత్యంత సామాన్యంగా, భక్తిశ్రద్ధలతో సాగిన ఆమె పర్యటన స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్త వీరన్న ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అన్నా లెజినోవా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఆలయ సందర్శనలో భాగంగా అన్నా లెజినోవా తొలుత ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని దర్శించి నమస్కరించుకున్నారు. అనంతరం వల్లభ గణపతిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. లోకకళ్యాణం కోరుతూ అమ్మవారికి ఆమె ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు పలువురు రష్యన్ మహిళలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
Also Read- Malavika Mohanan: ట్రెండీ అవుట్ ఫిట్ లో మాళవిక అందాలు..
దర్శనానంతరం ఆలయ స్నపన మండపంలో అన్నా లెజినోవాకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు వెంకటనాగరాజ శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆమెకు మహదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె భారతీయ సంప్రదాయంపై చూపిస్తున్న గౌరవాన్ని చూసి అర్చకులు సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అన్నా లెజినోవాకు ఆలయ మర్యాదల ప్రకారం శేషవస్త్రాలను బహూకరించారు. అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి, ఆలయ విశిష్టతను వివరించారు. ఎంతో ప్రశాంతంగా దర్శనం పూర్తి చేసుకున్న ఆమె, ఆలయ పరిసరాలను చూసి ముగ్ధులయ్యారు. మరో వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో, ఆయన భార్య ఇలా ఆధ్యాత్మిక పర్యటనలు చేయడం, ముఖ్యంగా తెలంగాణలోని శక్తిపీఠమైన భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
Also Read- Khushbu Sundar: మెగా, వెంకీ మ్యాజిక్కు ఖుష్బూ ఫిదా.. రివ్యూ చూశారా!