Bangladesh: బంగ్లాదేశ్ లో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ ఉద్రిక్తతలు అసలు చల్లారడం లేదు. విద్యార్థుల ఉద్యమంతో మొదలైన అల్లర్లు ఇప్పుడు మతపరమైన హింసకు, రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. తాజాగా మైమెన్ సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని అల్లరి మూకలు అత్యంత పాశవికంగా హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు కట్టి సజీవ దహనం చేయడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఈ హింస మరింత పెరిగింది.
గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ చరిత్రలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవడంతో.. అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ప్రాణభయంతో దేశం విడిచిపెట్టారు. దశాబ్దాలుగా భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రదేశ నాయకురాలిగా ఉన్న హసీనాకు, మానవీయ కోణంలో భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. అప్పటి నుండి ఆమె భారత్లోనే సురక్షిత ప్రాంతంలో ఉంటున్నారు.
షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ దౌత్య నీతి ప్రకారం.. ఆపదలో ఉన్న మిత్రదేశ అధినేతను ఆదుకోవడం భారత్ బాధ్యత అని మెజారిటీ నిపుణులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ అభివృద్ధిలో, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో హసీనా భారత్కు ఎంతో సహకరించారు. హసీనాను ఇక్కడే ఉంచుకోవడం వల్ల బంగ్లాదేశ్లో ఏర్పడిన కొత్త తాత్కాలిక ప్రభుత్వంతో భారత్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఒక్క వ్యక్తి కోసం పొరుగు దేశంతో ఉన్న దౌత్య సంబంధాలను పణంగా పెట్టవచ్చా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఆయన తప్పుబడుతున్నారు. ‘భారత్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను పంపించేయాలని నిత్యం గళమెత్తే ప్రభుత్వం, అధికారం కోల్పోయిన షేక్ హసీనాను ఎందుకు ఇక్కడ ఉంచుకుంటోంది? ఆమె కూడా బంగ్లాదేశీయురాలే కదా! ఆమెను వెంటనే వెనక్కి పంపాలి’ అని ఒవైసీ డిమాండ్ చేశారు. హసీనాకు ఆశ్రయం ఇవ్వడం వల్ల బంగ్లాదేశ్ ప్రజల్లో భారత్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని ఆయన వాదిస్తున్నారు.
ఒకప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గొప్పగా కొనసాగాయి. వాణిజ్యం, భద్రత, రవాణా రంగాల్లో ఇరు దేశాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశాయి. అయితే, హసీనా నిష్క్రమణ తర్వాత అక్కడ భారత వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆమెపై అక్కడ అనేక హత్య కేసులు నమోదయ్యాయి.
హసీనా విషయంలో భారత్ ఇప్పుడు సంకట స్థితిలో ఉంది. ఆమెను అప్పగిస్తే మిత్రద్రోహం చేసినట్లు అవుతుంది, అప్పగించకపోతే బంగ్లాదేశ్లోని కొత్త అధికార యంత్రాంగంతో మరియు అక్కడి ప్రజలతో దూరం పెరుగుతుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని భారత్ ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ మళ్లీ స్నేహ హస్తం అందిస్తుందా లేదా చైనా, పాకిస్థాన్ వైపు మొగ్గు చూపుతుందా అనేది భారత విదేశాంగ నీతికి ఒక పెద్ద పరీక్షగా మారింది.
ALSO READ: Jakkampudi Raja: నన్నయ యూనివర్సిటీలో గొడవ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు