Jakkampudi Raja: నన్నయ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన ఘటనలపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ప్రచార పిచ్చితోనే యూనివర్సిటీలో గొడవ జరిగిందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే పని చేశామని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఘోరాలు, దారుణాలు చూస్తున్నామని అన్నారు. వీసీలను భయపెట్టి, ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించారని ఆరోపించారు. నాయకుడు ఏ మార్గంలో ముందుకు వెళ్తాడో అదే మార్గాన్ని వారి అనుచరులు అనుసరిస్తున్నారని, దీనికి నన్నయ యూనివర్సిటీలో జరిగిన గొడవే నిదర్శనమని చెప్పారు.
విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోయిందని మండిపడ్డారు. అర్ధరాత్రి యూనివర్సిటీలో చొరబడి గ్లాస్, సైకిల్ గుర్తులు ఉన్న నాయకుల బ్యానర్లు కట్టడం తప్పని అన్నారు. దీనిని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సతీమణి వీసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, వీసీని అడ్డుకున్న అటెండర్ చరణ్పై దారుణంగా దాడి చేశారని తెలిపారు.
కనీసం 8వ తరగతి కూడా పాస్ కాకపోయిన స్థానిక ఎమ్మెల్యే బలరామకృష్ణ, అతడి సతీమణి అత్యున్నత విద్యావంతుడైన వీసీని కులపరంగా దూషించడం దారుణమని వ్యాఖ్యానించారు. నన్నయ యూనివర్సిటీ కోసం తన తండ్రి రామ్మోహన్ రావు వేసిన పునాది రాయిని తొలగించినప్పటికీ తాము సంయమనం పాటించామని గుర్తు చేశారు. యూనివర్సిటీ భవనాలు తమ హయాంలోనే పూర్తయ్యాయని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.