ఉక్కు దిగ్గజం, బ్రిటన్ ధనవంతులలో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశాన్ని వీడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ నుంచి దుబాయ్ లోని నైయా లగ్జరీ ద్వీపానికి మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది ప్రపంచంలోని ధనవంతుల కోసం రూపొందించబడిన భద్రతతో కూడిన లగ్జరీ జోన్. త్వరలోనే ఆయన అక్కడికి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
యూకే ప్రభుత్వం త్వరలో సరికొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ విధానం బ్రిటన్ లోని ధనవంతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించబోతుంది. యూకేలో సుమారు రెండున్నర శతాబ్దాలుగా అమల్లో ఉన్న నాన్ డోమ్ పన్ను విధానాన్ని రద్దు చేయాలని కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రభుత్వం నిర్ణయించింది. పాత పన్ను విధానంతో యూకే నివాసితులు తమ విదేశీ ఆదాయంపై బ్రిటన్లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణయంతో విదేశీ ఆదాయంపైనా బ్రిటన్ లో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మిట్టల్ లాంటి ధనవంతులు యూకేను వీడి, ఇతర దేశాలవైపు అడుగులు వేస్తున్నారు.
స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అయిన ఆర్సెలార్ మిట్టల్ లో మిట్టల్ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. ప్రస్తుతం మిట్టల్ సంపద 15.4 బిలియన్ పౌండ్లతో యూకేలో ఎనిమిదో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. భారతీయ కుబేరుల్లో 12వ స్థానం, ప్రపంచ స్థాయిలో 104వ ర్యాంకును సంపాదించారు. ఆయన కుమారుడు, కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్టల్ భవిష్యత్ పెట్టుబడుల కోసం దుబాయ్ వైపు దృష్టి సారించారు. ఇదే సమయంలో బ్రిటన్ సర్కారు కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో చాలా మంది ధనవంతుల మాదిరిగానే మిట్టల్ దేశాన్ని వీడేందుకు రెడీ అవుతున్నారు.
దుబాయ్ లో మిట్టల్ కుటుంబానికి ఇప్పటికే ఓ నివాసం సముదాయం ఉంది. రీసెంట్ గానే ఆయన యూఏఈలోని నైయా ఐలాండ్ లో ఆయన కొంత భూమిని కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. బ్రిటన్ నుంచి దుబాయ్కి తన నివాసాన్ని మార్చాలని భావిస్తున్న మిట్టల్ ఆ ఐలాండ్ లో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ద్వీపాన్ని అత్యంత సంపన్నులను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నారు. ఎక్కువ ప్రైవసీ, అధిక భద్రతను కలిగి ఉంటుంది. నైయా ద్వీపంలో పరిమిత సంఖ్యలో బ్రాండెడ్ గృహాలు, ఎస్టేట్ ప్లాట్లు అంటే.. ప్రతి నివాసం ప్రత్యక్ష ప్రైవేట్ బీచ్ యాక్సెస్ తో నిర్మించబడింది. సముద్ర జీవితాన్ని ఆస్వాదించే వారికి, ప్రత్యేకమైన యాచ్ బెర్త్ లతో కూడిన ప్రైవేట్ మెరీనా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. నైయా ద్వీపం సహజ సౌందర్యం, హై ఎండ్ లివింగ్ ను మిక్స్ చేస్తుంది. 2029 నాటికి ఈ ఐలాండ్ లో విల్లాల నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. నైయా ద్వీపంలో మిట్టల్ ఇల్లు 21,000- 48,000 చదరపు అడుగుల మధ్య విస్తరించి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ విల్లా ధరలు దాదాపు AED 45 మిలియన్లు (సుమారు రూ. 109.3 కోట్లు) నుంచి ప్రారంభమవుతాయి. అటు బ్రిటన్ లో అత్యంత ఖరీదైన నివాసాల్లో మిట్టల్కు చెందిన తాజ్ మిట్టల్ కూడా ఒకటి. కింగ్ స్టన్ ప్యాలెస్ గార్డెన్స్ లో 55వేల చదరపు అడుగుల్లో ఇది విస్తరించి ఉన్నది. 2004లో దీన్ని సుమారు రూ.593 కోట్లు పెట్టి మిట్టల్ కొనుగోలు చేశారు.
Read Also: 19 గంటల ప్రయాణం 2 గంటల్లో పూర్తి.. వచ్చేస్తోంది బుల్లెట్ రైలు!