NEET Result 2024 Controversy Highlights: నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో కూడిన నివేదిక ఇస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్టీయే డీజీ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. 1500 మందిపైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని.. ఆ తరువాత ఫలితాలను సవరించే అవకాశముందని పేర్కొన్నారు.
నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్టీయే డీజీ సుబోధ్ కుమార్ ఖండించారు. పేపర్ లీక్ కాలేదని.. ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే పలువురు విద్యార్థులు అధికంగా మార్కులు సాధించడానికి కారణాలంటూ ఆయన వివరించారు. అందుకే 1563 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని, ఆ తరువాత ఫలితాలను సవరించే అవకాశముందని పేర్కొన్నారు.
2019 నుంచి ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో పరీక్షలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్ స్కోర్ సాధించారు. అయితే, ఈసారి మాత్రం అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, హర్యానాలో ఒకే సెంటర్ లో పరీక్ష రాసిన ఏడుగురు ఉన్నారనే వార్తలు.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, కొంతమంది విద్యార్థులకు 100 పైగా గ్రేస్ మార్కులు కలిపారనే విమర్శలు వస్తున్నాయి. జూన్ 14న విడుదల చేస్తామన్న ఫలితాలు జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున విడుదల చేయడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.
Also Read: ఐదు రోజులే గడువు.. తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?
ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు దీరాక జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై ప్రధానంగా ప్రస్తావించేందుకు విపక్షాలు సిద్ధమైనట్లు తెలుస్తుంది.