రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ అందించింది. ఎన్టీపీసీ (NTPC) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) తాత్కాలిక తేదీలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో పరీక్షల నిర్వహణను అధికారులు మూడు దశలుగా విభజించారు. పారదర్శకతతో కూడిన ఎంపిక ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
రైల్వే బోర్డు ప్రకటించిన వివరాల ప్రకారం మే 7వ తేదీన మొదటి దశ పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 7, 8, 9 తేదీల్లో తొలి విడత అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి. అనంతరం రెండో దశ పరీక్షలను జూన్ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. చివరగా మూడో దశ పరీక్షలు జూన్ 16న మొదలై జూన్ 21వ తేదీ వరకు కొనసాగుతాయి. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రాలను కేటాయిస్తూ షెడ్యూల్ రూపొందించారు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3058
పరీక్షా కేంద్రాల వివరాల విషయంలో అభ్యర్థులకు స్పష్టతనిచ్చారు. తమకు కేటాయించిన పరీక్ష నగరం అలాగే తేదీ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ప్రయాణ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించారు. ఇక హాల్ టికెట్ల విషయానికొస్తే పరీక్ష తేదీకి కేవలం నాలుగు రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డులను (e-call letters) డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసం చేయాలని చూస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రైల్వే నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతీయ రైల్వే బోర్డుల అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలి.
నిర్దేశించిన తేదీల్లో పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ వేగవంతం చేస్తూ అధికారిక పోర్టల్స్ను గమనిస్తూ ఉండాలి.
ALSO READ: కోర్టులో భారీగా ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలో జాబ్ భయ్యా, APPLY NOW