దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. యూపీఎస్సీ అధికారికంగా ఈ ప్రకటనను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అఖిల భారత సర్వీసుల్లో ఖాళీగా ఉన్న 933 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) లో మరో 80 పోస్టుల భర్తీకి కూడా కమిషన్ విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ విధానమిదే..
సివిల్స్-2026కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 24
చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అభ్యర్థులు త్వరగా తమ దరఖాస్తులను పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.
యూపీఎస్సీ ముఖ్యమైన తేదీలు..
యూపీఎస్సీ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. మే 24న ప్రిలిమినరీ పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి ఆగస్టు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉండి.. నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని కలిగి ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష మాత్రం డిస్క్రిప్టివ్ (వివరణాత్మక) పద్ధతిలో జరుగుతుంది. ఈ రెండింటిలోనూ రాణించిన అభ్యర్థులకు చివరగా పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించి, తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.
విద్యార్హతల వివరాలు..
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా చివరి ఏడాది చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: ఆగస్టు 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో మినహాయింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల సౌకర్యార్థం ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రిలిమ్స్ కేంద్రాలు: హైదరాబాద్, హన్మకొండ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం..
మెయిన్స్ కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత స్థాయి కొలువులను సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక సువర్ణావకాశం. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
అప్లికేషన్ లింక్: https://upsconline.nic.in/
ALSO READ: Cochin Shipyard: పదో తరగతి అర్హతతో 260 ఉద్యోగాలు.. నెలకు రూ.23,000 జీతం, ఇంకా 2 రోజులే భయ్యా..