AP Dairy Farmers: ఏపీ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘పశు కిసాన్ క్రెడిట్ కార్డు’లపై పాడి రైతులకు రుణాలు అందించాలని నిర్ణయించింది. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందుల పంపకం కోసం ఆర్థిక సాయం అందించేందుకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సొంత భూమి లేదా కౌలు భూమి కలిగిన పాడి రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు పొందడానికి అర్హులు అవుతారు. పశువుల సంఖ్యను బట్టి బ్యాంకు నిబంధనలకు తగిన విధంగా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.3 లక్షల వరకు లోన్ మంజూరు చేస్తారు.
పాడి రైతులు తమకు దగ్గరలోని బ్యాంకును సంప్రదించి పశు కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, భూమి పాస్ పుస్తకం, పశువుల సమాచారం, రైతు పాస్ పోర్టు ఫొటో, పశువైద్యాధికారి సర్టిఫికెట్ ను దరఖాస్తుకు జోడించాలి. లోన్ తీసుకున్న పాడి రైతులు పశువుల దాణా, పశువుల యాజమాన్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా కేవలం 7 శాతం వడ్డీ రేటుతో పాడి రైతులకు రుణం అందిస్తారు. ఈ రుణాలను ఏడాది లోపు తిరిగి చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. కేవలం 4 శాతం వడ్డీ కడితే సరిపోతుంది.
పశువులకు హాస్టళ్లు ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఐదు చొప్పున పశు వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాకు ఐదు చొప్పున నియోజకవర్గాల కేంద్రాలలో పశువసతి గృహాలను నిర్మించనున్నారు. పశు వసతి గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను రెవెన్యూ శాఖ కేటాయించనుంది. వీటిని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించనుంది. వసతి గృహాల్లో పశువులకు పశుసంవర్ధక శాఖ వైద్య సేవలు అందిస్తుంది. పశు వసతి గృహాల రోజు వారీ నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు.
Also Read: ఆర్బీఐ కొత్త గోల్డ్ లోన్ రూల్స్.. ఇక తక్కువ బంగారంపై ఎక్కువ లోన్ పొందవచ్చు
ఒక్కో పశువసతి గృహంలో 20-25 పెద్ద పశువులకు నివాసం కల్పిస్తారు. మిగిలిన స్థలంలో పశువుల మేత కోసం పచ్చ గడ్డి పెంచుతారు. అలాగే తాగునీరు సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో వసతి గృహం నిర్మాణానికి రూ. 10 లక్షలు అవసరం అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వీటి నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పశు వసతి గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.