Rahul Meena arrested: రాజస్థాన్ దేశ రాజధాని ఢిల్లీలను వణికించిన ఒక అత్యంత కిరాతక ఉగ్రరూపాన్ని 23 ఏళ్ల రాహుల్ మీనా ప్రదర్శించాడు. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఇద్దరు యువతులపై అత్యాచారం చేసి, అందులో ఒకరిని దారుణంగా హత్య చేసిన ఈ నిందితుడి ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత రాజస్థాన్లోని అల్వార్లో ఒక మహిళపై అమానుషంగా దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టిన రాహుల్, అక్కడి నుండి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడ మరో ఘోరానికి పాల్పడి, చివరకు బుధవారం రాత్రి పోలీసులకు చిక్కాడు.
నిందితుడు రాహుల్ మీనా మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో అల్వార్లోని తన పొరుగున ఉండే మహిళ ఇంట్లోకి చొరబడి, ఆమె నోరు నొక్కి, గొంతు పిసికి దారుణంగా అత్యాచారం చేశాడు. బాధితురాలి శరీరంపై పలుచోట్ల కొరికి గాయపరిచిన అతడు, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై అల్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించక ముందే, నిందితుడు ఢిల్లీకి చేరుకుని తన పాత యజమాని ఇంటిని టార్గెట్ చేశాడు.
ఢిల్లీలోని అమర్ కాలనీలో నివసిస్తున్న ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి ఇంట్లో రాహుల్ గతంలో పనిమనిషిగా ఉండేవాడు. బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో ఆ అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన అతడు, నేరుగా మేడపై ఉన్న స్టడీ రూమ్లోకి వెళ్లాడు. అక్కడ యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న అధికారి కుమార్తె (22) పై దాడి చేసి, ప్రతిఘటించిన ఆమెను గొంతు పిసికి, బరువైన వస్తువుతో తలపై కొట్టి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, రక్తపు మడుగులో ఉన్న యువతి వేలిముద్రతో లాకర్ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో స్క్రూ డ్రైవర్తో లాకర్ పగులగొట్టి నగదు, నగలు దోచుకున్నాడు.
నేరం చేసిన తర్వాత నిందితుడు తన రక్తపు మరకల దుస్తులను మార్చుకుని, బాధితురాలి సోదరుడి ప్యాంట్, చెప్పులు ధరించి అక్కడి నుండి పరారయ్యాడు. ఉదయం 8 గంటలకు జిమ్ నుండి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు, తమ కుమార్తె రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉండటం చూసి విస్తుపోయారు. ఢిల్లీ పోలీసులు 15 బృందాలతో గాలింపు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడు ప్రయాణించిన ఆటో రిక్షాను గుర్తించారు. ఆ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఒక హోటల్లో తలదాచుకున్న రాహుల్ను అరెస్ట్ చేశారు.
అతనికి బెట్టింగ్ అలవాటు ఉన్నట్లు తెలిసింది. ఆ అలవాటు కోసమే తన యజమానుల వద్ద డబ్బులు తీసుకుని దుకాణదారులకు చెల్లించకుండా మోసాలకు పాల్పడేవాడు. ఈ విషయం తెలిసిన ఐఆర్ఎస్ అధికారి కుటుంబం కొన్ని నెలల క్రితమే అతడిని పనిలో నుండి తొలగించింది. ఆ కక్షతోనే రాహుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిపై అత్యాచారం, హత్య, దోపిడీ కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: బ్రీత్ అనలైజర్ ఊదను.. ఏం చేసుకుంటారో చేసుకోండి! హైదరాబాద్లో యువతి రచ్చ