Attack On Rasamai Balakishan : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కి నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద ఎమ్మెల్యే రసమయిను అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు.
గుండ్లపల్లి నుంచి గన్నేరువరంకు డబుల్ రోడ్ వేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు. యువజన సంఘాల ధర్నాకు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. ఐతే అదే సమయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అటుగా రావడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు.
ఎమ్మెల్యే కారుపై దాడికి యత్నించారు. రసమయి బాలకిషన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే కాన్వాయ్పై చెప్పులు విసిరారు. నిరసనలతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. నిరసనకారుల ఆందోళనతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. పలువురిని అరెస్ట్ చేసారు.