Hyderabad water supply: బోరబండ, రహ్మత్ నగర్ సమీపంలోని ఎస్పీఆర్ హిల్స్ కాలనీ నీటి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. పలు కాలనీల్లో రాత్రి సమయంలో నీటి సరఫరా వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి రూ. రెండున్నర కోట్లతో ఫీడర్ మెయిన్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీఆర్ హిల్స్ లో నిర్మిస్తున్న పైపులైను నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ నిర్మాణ పనులలో వేగం పెంచి ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే కార్మికుల సంఖ్య పెంచి, మరిన్ని బృందాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎస్పీఆర్ హిల్స్ ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బంది పడేవారన్నారు.
దీంతోపాటు మరికొన్ని బస్తీల్లో రాత్రి సమయంలోనూ మంచినీటి సరఫరా చేయడం, లో ప్రెషర్ లాంటి సమస్యలు ఉండేవని చెప్పారు. గత సవంత్సరంలో బోరబండ, రహమత్ నగర్ డివిజన్ లలోని 52 బస్తీల్లోని, పలు కాలనీల నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రూ. 5.7 కోట్ల వ్యయంతో 3 మిలియన్ లీటర్ల రిజర్వాయర్ ను నిర్మాణం పూర్తి చేసిందని వెల్లడించారు. రికార్డ్ స్థాయిలో ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ గత సంవత్సరం మే నెలలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల బోరబండ, రహమత్ నగర్ డివిజన్ లోని 52 బస్తీల్లోని ప్రజలకు ప్రత్యామ్నాయ రోజులలో ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నీటి సరఫరా చేస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.
Also Read: GHMC: బల్దియా చిట్ట చివరి స్టాండింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన అంశాలివే..?
ఈ రిజర్వాయర్ పరిధిలో అన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయడంతో పాటు రాత్రి సమయంలో గాక, ఉదయం నుండి సాయంత్రం సమయాల్లో సరఫరా చేసే వీలుగా ఎస్పీఆర్ హిల్స్ రిజర్వాయర్ నుండి బ్రహ్మశంకర్ నగర్ దేవాలయం వరకు 450 మి.మీ డయా ఎంఎస్ వాటర్ పైప్ లైన్, బ్రహ్మశంకర్ నగర్ దేవాలయం నుండి కార్మిక నగర్ ఆటో స్టాండ్ వరకు 300 మి.మీ డయా ఎంఎస్డీఐ వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేపడున్నామని తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే కార్మిక నగర్, బ్రహ్మశంకర్ నగర్ ప్రాంతాలలో రాత్రి వేళల నీటి సరఫరాను నివారించటంతో పాటు నీటి సరఫరా సైతం మెరుగవుతుందని వివరించారు. నగరంలో రాత్రి సమయంలో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమయానుకూలంగా అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం సమయాల్లో నీటి సరఫరా జరిగే విధంగా ప్రణాళికలును రూపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎంలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్చెరులో 25 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్ను ఏర్పాటు చేసే పనులు చేపడుతున్నందున నగరంలో బుధ,గురువారాల్లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయమేర్పడనున్నట్లు జలమండలి పేర్కొంది. అదే సమయంలో, అమీన్పూర్ ఎక్స్రోడ్ నుండి మాదీనగూడ వరకు పైప్లైన్లో ఏర్పడిన లీకేజీలకు, అవసరమైన చోట్ల ఎంఎస్ బ్యారెల్స్ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజైన గురువారం 12వ తేదీ రాత్రి పది గంటల వరకు పనులు చేపట్టనున్నందున సప్లై లో అంతరాయమేర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పనుల కారణంగా 40 గంటలు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజర్ తో నీటిసరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు జలమండలి తెలిపింది.
జలమండలి ఆపరేషన్, మెయింటనెన్స్ డివిజన్-17 లోని ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, ఓ అండ్ ఎం డివిజన్-22 లోని బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ. ట్రాన్స్ మిషన్ డివిజన్-2లోని ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు. ఓ అండ్ ఎం డివిజన్-6 లోని ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్. ఓ అండ్ ఎం డివిజన్-9 లోని కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయమేర్పడనున్నట్ల విషయాన్ని గ్రహించి, పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.