Medaram Jathara 2026: మేడారం సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో పారదర్శకంగా కొనసాగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో గత ఆరు రోజులుగా జరుగుతున్న ఈ లెక్కింపులో ఇప్పటివరకు మొత్తం రూ.12.64 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. జాతర కోసం ఏర్పాటు చేసిన మొత్తం 828 హూండీలను ఇప్పటికే తెరిచి లెక్కించినట్లు సమాచారం.
లెక్కింపు వివరాలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీ వరకు వివిధ దశల్లో ఆదాయం నమోదైంది. అత్యధికంగా ఫిబ్రవరి 6వ తేదీన రూ.3.54 కోట్లు రాగా, చివరి రోజైన ఫిబ్రవరి 10న 40 హూండీల ద్వారా రూ.80.81 లక్షల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 10న లెక్కించిన ఈ నగదును పర్యవేక్షణాధికారుల సమక్షంలో నేరుగా బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. 828 హూండీలలో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నాయని వారు వివరించారు.
నగదుతో పాటు భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలను ప్రస్తుతం ఇనుప హూండీలలో భద్రపరిచారు. వీటి విలువను నిర్ధారించే అప్రైజ్మెంట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, నాణేల లెక్కింపు, ఈ-హుండీ (E-Hundi) లెక్కింపు ప్రక్రియలు ప్రారంభం కావాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ రూపంలో కూడా కొంత ఆదాయం సమకూరినట్లు లెక్కింపు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కింపు ప్రక్రియ అంతా నిబంధనల మేరకు ప్రశాంతంగా పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ భరోసా ఇచ్చింది.
Read Also: HYDRA: రూ. 1511 కోట్ల భూములు సేఫ్.. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో హైడ్రా బిగ్ ఆపరేషన్లు!