కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐసీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 376 సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్-ఏ (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి ఈ షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా గేట్ (GATE) అర్హత సాధించిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ వివరాలు..
మొత్తం 376 పోస్టులలో వివిధ కేటగిరీల వారీగా ఖాళీలను కేటాయించారు. అన్-రిజర్వ్డ్ కేటగిరీలో 154 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకు 101, ఎస్సీలకు 56, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 37, ఎస్టీలకు 28 పోస్టులను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతన శ్రేణి వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
అర్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ (M.Sc), ఎంఎస్ (MS), ఎంసీఏ (MCA) లేదా బీఈ/బీటెక్ (B.E/B.Tech) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు అత్యంత కీలకమైన నిబంధన ఏమిటంటే, అభ్యర్థులు తప్పనిసరిగా 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో ఏదో ఒక ఏడాది సాధించిన చెల్లుబాటు అయ్యే గేట్ (GATE) స్కోర్ను కలిగి ఉండాలి. ఈ గేట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగుతుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం..
ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదలైన నేపథ్యంలో.. పూర్తి స్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలోనే ఎన్ఐసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది. గేట్-2026 ఫలితాలు మార్చి 11, 2026న విడుదల కానున్నాయి. ఫలితాలు వెల్లడైన నాటి నుండి 10 రోజుల వ్యవధిలోపు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్ఐసీ వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించి, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
డిజిటల్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడంలో ఎన్ఐసీ కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో.. ఐటీ నిపుణులకు ఇదొక మంచి కెరీర్ ప్లాట్ఫారమ్గా నిలవనుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎన్ఐసీ అధికారిక పోర్టల్ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.nic.in/
ALSO READ: DGP Shivadhar Reddy: మున్సిపోరుకు భారీ బందోబస్తు.. 3వేల మంది అదనపు బలగాలు.. డీజీపీ కీలక సూచనలు