గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామ పరిధిలో గల పెరిజిపల్లి ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ CRR SC కాంపోనెంట్ ఫండ్స్ ద్వారా కేటాయించిన రూ. 22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన రోడ్డు పనులను గురువారం ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ఈ పనులు చేపట్టినట్లు నాయకులు వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిపై మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు. కేవలం మాదాపూర్ మాత్రమే కాకుండా.. మండలంలోని కొండాపూర్, చీమలకుంటపల్లి, గన్నేరువరం గ్రామాలకు సైతం CRR SC కాంపోనెంట్ ఫండ్స్ నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకి మండల ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
మొత్తం మూడు విడతల్లో ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు రవీందర్ రెడ్డి వివరించారు. నాణ్యతతో కూడిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి.. మాదాపూర్ రూపురేఖలు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు కటికం తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షులు మార్గం మల్లేశం పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ పాలక వర్గ సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో గన్నేరువరం మండలం ప్రగతి పథంలో పయనిస్తోందని స్థానిక నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: Defections of MLAs: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? రేపే సుప్రీంలో అసలు సిసలైన విచారణ