Kalvakuntla Kavitha: మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది స్వప్న అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటనపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ, వివాహం చేసుకోవాల్సిన వయసులో ఉన్న ఒక ఆడబిడ్డను సొంత కుటుంబ సభ్యులే ఇలా కడతేర్చడం ఎవరూ జీర్ణించుకోలేని విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలచివేసిందని, నిందితులకు చట్టం పట్ల భయం లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు.
ముఖ్యంగా ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కవిత ఆరోపించారు. బాధితురాలు ప్రాణహాని ఉందని ముందుగానే ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని, ఒకవేళ సమయానికి స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, తుపాకులతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏదైనా ఫిర్యాదు వస్తే పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకునేలా ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
న్యాయవాదుల రక్షణ కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను వెంటనే అమలులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లు రెండేళ్లుగా అసెంబ్లీలో ఆమోదం పొందకుండా పెండింగ్లో ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అడ్వకేట్ స్వప్న హత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా పూర్తి చేసి, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కవిత డిమాండ్ చేశారు.
Read Also: Mulugu District: వదంతులకు చెక్.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. తేల్చిన జాతీయ మహిళా కమిషన్!