Defections of MLAs: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ కేసును జస్టిస్ అగస్టీన్ జార్జ్ , జస్టిస్ సంజయ్ కరోల్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం విచారించనుంది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే.. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇటీవల సదరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు.. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయకూడదని.. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్లపై ఉందని అత్యున్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసింది.
స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ వ్యవహరించిన తీరు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలా ఉందని ఆరోపిస్తూ ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ను కూడా వేశారు. కోర్టు నిర్దేశించిన గడువును, సూచనలను పాటించకుండా ఏకపక్షంగా క్లీన్ చిట్ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు.
రేపటి విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ను పరిగణనలోకి తీసుకుంటుందా లేదా కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఎలాంటి చర్యలు చేపడుతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ తీర్పు తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించనుంది.
Also Read: మాట తప్పని ప్రభుత్వం మాది.. గ్యారెంటీలను పట్టాలెక్కిస్తున్నా.. శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు