జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఏపీ, తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులు కేకులు కట్ చేసి తమ ప్రియతమ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు చెబుతున్నారు. జనసేన ఇకముందు కూడా రాజకీయాల్లో సత్తా చాటాలని, పవన్ కళ్యాణ్ మరిన్ని పదవులను చేపట్టాలని, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం ఆధారంగా పేదలకు న్యాయం చేయాలని ఆకాక్షింస్తున్నారు. కాగా, జనసేన పార్టీ ఆవిర్భించి 13 ఏండ్లు పూర్తి చేసుకుంది. పార్టీ స్థాపించిన పదేండ్లు అధికారానికి జనసేన దూరంగానే ఉన్నది. కేవలం ప్రతిపక్షంగా కొనసాగుతూ అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. 2014లో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు.
జనసేన పార్టీ ఆవిర్భవించిన మొదట్లో చంద్రబాబు విజ్ఞప్తి మేరకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కొత్త రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటాయని, వాటిని పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు.. పవన్తో చర్చించినట్టు తెలిసింది. ఒకవేళ పవన్ పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని చంద్రబాబు సూచన మేరకు జనసేన ఎన్నికలకు దూరంగా ఉండిపోయింది. నాడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్డీయేతో వైరుధ్యం వలన చంద్రబాబు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం, నిధుల కొరత, ఉద్యోగుల సమస్యలు, రాజధాని అమరావతిలో భారీ ల్యాండ్ స్కామ్ అంటూ ఆరోపణలు రావడంతో టీడీపీ పట్ల నాడు వ్యతిరేకత పెరిగింది.
ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన తొలిసారి పోటీ చేసింది. మొత్తం 137 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా.. కేవలం ఒక సీటు (రాజోల్ నియోజకవర్గం)లో మాత్రమే గెలుపొందింది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక, భీమవరం స్థానాల్లో బరిలోకి దిగిన పవన్ చివరకు ఓటమిని చవిచూశారు. అయినప్పటికీ కుంగిపోకుండా ప్రజల్లోనే ఉంటూ నాటి వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రజల పక్షాన ప్రశ్నించారు. జగన్ పాలనలో మూడు రాజధానుల పేరిట కాలయాపన జరగడంతో అమరావతి రైతులు రెండేండ్లు పాటు జరిపిన ఉద్యమానికి జనసేనాని మద్దతు తెలిపారు.ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు అవ్వడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. జైలుకు వెళ్లి బాబును కలిసిన అనంతరం పవన్ కీలక ప్రకటన చేశారు.
BRS : బడ్జెట్ సెషన్స్ ..ఆ ఎమ్మెల్యేలకు ‘విప్’ టెన్షన్!
జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు 2024 ఎన్నికల్లో కూటమి (టీడీపీ,జనసేన, బీజేపీ)కి అఖండ మెజార్టీని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 22 నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. బంపర్ మెజార్టీతో అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశ రాజకీయాల్లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ఆయనకు కూటమి సర్కారులో డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు మంత్రిత్వ శాఖలు దక్కాయి. అనంతరం పాలనపై ఫోకస్ పెట్టిన పవన్.. ఆ తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి సభ్యత్వాలు పెంచడంతో పాటు ఫౌండేషన్ గట్టిగా ఉండేలా కసరత్తు ప్రారంభించారు.వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగినా అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మున్ముందు సొంతంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా జనసేన పొలిటికల్ ఎఫర్ట్ పెడుతున్నట్టు తెలిసింది.