Khammam Husband WIfe Incident: ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ చాగంటి రవి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. మొదట దీన్ని ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. ఇన్సూరెన్స్ డబ్బులపై ఆశతో కట్టుకున్న భార్య ప్రశాంతి, తన ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి భర్తను అంతమొందించింది.
గత ఏడాది జూలైలో రవి అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతను ఎలాగో చనిపోతాడనే ఉద్దేశంతో ప్రశాంతి అతని పేరు మీద రూ. 66 లక్షల విలువైన బీమా చేయించింది. (SBIలో రూ. 40 లక్షల యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్, శ్రీరామ్ ఇన్సూరెన్స్లో రూ. 26 లక్షలు). డాక్టర్లు రవి ఎక్కువ కాలం బ్రతకడని చెప్పినప్పటికీ, రవి ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. దీంతో ఇన్సూరెన్స్ డబ్బులు రావని భయపడిన ప్రశాంతి, అతన్ని యాక్సిడెంట్ చేసి చంపితేనే పూర్తి సొమ్ము వస్తుందని పథకం వేసింది.
ఈ నెల 2వ తేదీన ప్రశాంతి తన ప్రియుడు శ్రీనివాస్, మరికొందరు నిందితులతో (జోగి రాజ్ కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు) కలిసి స్కెచ్ వేసింది. నిందితుడు శ్రీనివాస్, రవిని మద్యం తాగించడానికి బయటకు తీసుకెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు వెంకటపాలెం శివారులో చీకటిగా ఉన్న ప్రాంతంలో దించాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన రాజ్ కుమార్, ఇతరులు కారుతో రవిని వేగంగా ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన తర్వాత ప్రశాంతి ఏమీ ఎరగనట్లు నటించినప్పటికీ, పోలీసులకు ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పోలీసులు నిందితుల సెల్ ఫోన్ డేటాను విశ్లేషించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రశాంతి, శ్రీనివాస్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్, అలాగే నిందితులందరూ ఒకే ప్రాంతంలో ఉన్నట్లు టెక్నికల్ ఆధారాలు లభించాయి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, బీమా సొమ్ములో సగం వాటా ఇస్తామనే ఒప్పందంతో ఈ హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: Hash Oil: డబ్బు కోసం.. మనుషుల ప్రాణాలతో చెలగాటం