Hash Oil: తేలికగా డబ్బు సంపాదించటానికి ప్రమాదకరమైన హాష్ ఆయిల్ విక్రయిస్తున్న పెడ్లర్ తోపాటు ఓ వినియోగాదారున్ని ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ముషీరాబాద్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 367గ్రాముల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన డోవారి జ్యోతిరత్న ప్రదీప్ (34) కొంతకాలం క్రితం హైదరాబాద్ వలస వచ్చి యాప్రాల్ ప్రాంతంలోని బాలాజీనగర్ లో స్థిరపడ్డాడు. ఏ పనీ చేయకుండా తిరుగుతున్న ప్రదీప్ డబ్బు సంపాదన కోసం హాష్ ఆయిల్ అమ్మాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో గుంటూరుకే చెందిన తన స్నేహితుడు షేక్ మహబూబ్ భాషాతో కలిసి విశాఖపట్టణానికి చెందిన తంబెలి ఛత్రపతి ఎలియాస్ తిరుపతి నుంచి లీటర్ హాష్ ఆయిల్ ను 50వేల రూపాయలకు కొని హైదరాబాద్ తీసుకు రావటం మొదలు పెట్టాడు. ఇక్కడకు వచ్చిన తరువాత చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో హాష్ ఆయిల్ ను ప్యాక్ చేసి ఒక్కోదానిని 2వేల నుంచి రెండున్నర వేల రూపాయలకు అమ్ముతున్నాడు. గోల్కొండ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో నివాసముంటున్న కోట విజయ్ కుమార్ (46) అతని రెగ్యులర్ కస్టమర్. కాగా, ప్రదీప్ సాగిస్తున్న ఈ దందా గురించి టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ పీ.రాఘవేందర్ పక్కాగా సమాచారాన్ని సేకరించారు.
Also Read: Anantapur Incident: తాడిపత్రిలో ఘోరం.. అనుమానంతో భార్యను అతి కిరాతంగా చంపి, ఆ తర్వాత..
ఎస్ఐ జ్ఞానదీప్ తోపాటు సిబ్బందితో కలిసి ప్రదీప్ కదలికలపై నిఘా పెట్టారు. ఆదివారం ముషీరాబాద్ రిసాలగడ్డ హవేలి ప్రాంతంలో ప్రదీప్ హాష్ ఆయిల్ ను విజయ్ కుమార్ కు విక్రయిస్తుండగా దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రదీప్ పై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నట్టుగా వెల్లడైంది. అరెస్ట్ చేసిన ఇద్దరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
Also Read: E Office: తెలంగాణ సర్కార్ మరో సంచలనం.. ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఈ-ఆఫీస్ లోనే..?