Maredudhalalu : శివుడుకి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును శివేష్ట అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది.
కార్తీకమాసం అంటే శివారాధన గుర్తుకి వస్తుంది. శివునికి ఇష్టమైన మారేడు దళంతో శివారాధన సంపూర్ణమవుతుంది. మూడు కొసలుగా చీలిన బిల్వపత్రాన్ని చూడగానే శివుని త్రిశూలమూ, త్రినేత్రమూ గుర్తుకువస్తాయి.
ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అందువల్లనే బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా భావించి పూజలు చేస్తారు.
బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది.
దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.
యజ్ఞయాగాలతోనూ, కన్యాదానాలతోనూ సమానమైన బిల్వార్చన చేస్తే మూడు జన్మలలోనూ చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయంటోంది బిల్వాష్టకం. కాబట్టే బిల్వవృక్షం శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. తెలుగులో మారేడుగా పిలుచుకునే బిల్వవృక్షం మన దేశంలోనే ఆవిర్భవించిందని చెబుతారు. ఇప్పటికీ మారేడు చెట్లు దక్షిణాసియాలోనే విరివిగా పెరుగుతాయి.